కరోనా మహమ్మారి ప్రభావమే : కేంద్రం
న్యూదిల్లీ : భారత విమానయాన రంగంలో కోవిడ్19 మహమ్మారి ప్రభావం కారణంగా ఏప్రిల్ 2020
డిసెంబర్ 2021 మధ్య దాదాపు 10 శాతం ఉద్యోగ నష్టం జరిగిందని కంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి వి.కె.సింగ్ తెలిపారు. విమానాలు, విమానాశ్రయాలు, గ్రౌండ్ హ్యాండ్లింగ్, ఎయిర్ కార్గో రంగంల్లో మొత్తంగా దాదాపు 19,200 ఉద్యోగాలు కోల్పోయారని రాజ్యసభలో ఒక ప్రశ్నకు సింగ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఈ రంగాల్లో మొత్తం ఉద్యోగాల్లో (దాదాపు 1.9 లక్షలు) దాదాపు 10 శాతం ఉద్యోగ నష్టం సంభవించినట్లు ఆయన పేర్కొన్నారు. ఏప్రిల్ 2020`డిసెంబర్ 2021 మధ్య విమానాలు, విమానాశ్రయాలు, గ్రౌండ్ హ్యాండ్లింగ్ సంస్థలతో పని చేసే మొత్తం ఉద్యోగుల సంఖ్య తగ్గింది. అదే సమయంలో విమాన కార్గో కంపెనీలకు పని చేసే వారి సంఖ్య పెరిగినట్లు కేంద్ర మంత్రి సింగ్ తెలిపారు. ‘విమాన కార్గోలో ఉద్యోగుల మొత్తం సంఖ్య మార్చి 31, 2020 నుంచి డిసెంబర్ 31, 2021 నాటికి దాదాపు 10,500కి పెరిగింది’ అని ఆయన పేర్కొన్నారు. భారత్లోని విమానయాన రంగంలో మొత్తం ఉద్యోగుల సంఖ్య మార్చి 31, 2020కి 74,800 నుంచి డిసెంబర్ 31, 2021కి 65,700కి తగ్గినట్టు వివరించారు. భారత విమానాశ్రయాల మండలి (ఏఏఐ) దేశవ్యాప్తంగా 100కి పైగా విమానాశ్రయాలను నడుపుతోంది. అయితే బెంగళూరు, హైదరాబాద్, దిల్లీ, ముంబై, అహ్మదాబాద్, గువహటి, జైపూర్, లక్నో, మంగళూరు, తిరువనంతపురంల్లో ప్రధాన విమానాశ్రయాలను ప్రైవేట్ ఆపరేటర్లు నడుపుతున్నారు. కాగా మార్చి 31, 2020 నాటికి భారత విమానాశ్రయాల నిర్వాహకులతో పని చేస్తున్న ఉద్యోగుల సంఖ్య 73,400 కాగా, డిసెంబర్ 31, 2021 నాటికి 65,700కి తగ్గిందని మంత్రి సింగ్ వివరించారు. అలాగే గ్రౌండ్ హ్యాండ్లింగ్ సంస్థల వద్ద పని చేసే ఉద్యోగుల సంఖ్య ఏప్రిల్ 2020లో 30,800 నుంచి డిసెంబర్ 2021లో 27,600కి తగ్గింది.