వారంలో రెండు రోజులు.. ఫిబ్రవరి 14 నుంచి అమలు
కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో సుప్రీంకోర్టులో భౌతిక విచారణలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 14 నుంచి వారానికి రెండుసార్లు భౌతిక విచారణలు జరగనున్నాయి. దిల్లీిలో కొవిడ్ కేసులు తగ్గుదలతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఈ నిర్ణయం తీసుకున్నారు. కరోనా కేసుల తగ్గడంతో సుప్రీంకోర్టు లాయర్ల కమిటీతో ఆయన సంప్రదింపులు జరిపారు. అనంతరం ఈ నిర్ణయానికి వచ్చారు. ఈ మేరకు కోర్టులో వారానికి రెండురోజులు అంటే ప్రతి బుధ, గురువారాల్లో భౌతిక విచారణలు చేపట్టనున్నారు. సోమ, శుక్రవారాల్లో విచారణలు ఆన్లైన్లో సాగుతాయి. మంగళవారం కూడా భౌతిక విచారణ చేపడతారు. కక్షిదారుల తరఫున అడ్వకేట్స్ ఆన్ రికార్డ్స్ ముందుగా దరఖాస్తు చేసుకుంటే ఆన్లైన్ విచారణకు అనుమతిస్తారు. ఈ మేరకు ప్రామాణిక నిర్వహణ పద్ధతుల్ని సవరిస్తూ సుప్రీంకోర్టు రిజిస్ట్రీ సర్క్యులర్ జారీ చేసింది. ఏ తరహా విచారణలకు ఎంతమందిని అనుమతించేదీ దీనిలో పేర్కొంది. పాజిటివిటీ రేటు గణనీయంగా తగ్గడంతో పాటు దిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, దిల్లీ ప్రభుత్వం జారీ చేసిన వివిధ సూచనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.