మంగళూరు: కర్ణాటకలో హిజాబ్ వివాదం కొనసాగుతోంది. తాజాగా దక్షిణ కన్నడ జిల్లా ఉప్పినంగడిలోని గ్రేడ్`1 ప్రభుత్వ కళాశాలలో నిర్దేశిత వస్త్ర ధారణ నిబంధన (డ్రెస్కోడ్)ను ఉల్లంఘించారంటూ 24మంది ముస్లిం బాలికలను కళాశాల యాజమాన్యం సస్పెండ్ చేసింది. కళాశాల అభివృద్ధి కమిటీ చైర్మన్గా ఉన్న పుత్తూరు ఎమ్మెల్యే సంజీవ మటండూరు మాట్లాడుతూ… తరగతి గదిలోకి హిజాబ్ ధరించి వచ్చిన మరో 24 మంది విద్యార్థులను సస్పెండ్ చేసినట్లు చెప్పారు. కళాశాలలో రెగ్యులర్ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కర్ణాటక హైకోర్టు విధించిన డ్రెస్ కోడ్ను విద్యార్థులు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హెచ్చరించారు. హిజాబ్ ధరించి తరగతిలోకి వెళ్లే విద్యార్థులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని లెక్చరర్లకు సూచించినట్లు కూడా ఆయన పేర్కొన్నారు. గత వారం కూడా ఇదే కళాశాలలో హిజాబ్ ధరించారన్న ఆరోపణపై ఏడుగురు ముస్లిం విద్యార్థులపై సస్పెన్షన్ విధించారు.