ఒడిశాలో తొలిదశలో ఎన్నికలు నిర్వహించనున్న 28 శాసనసభ నియోజకవర్గాల నుంచి పోటీ పడుతున్న అభ్యర్థుల్లో 70 మంది కోటీశ్వరులు ఉన్నారు. మే 13న జరగనున్న ఎన్నికలకు ఆయా నియోజకవర్గాల నుంచి మొత్తం 243 మంది బరిలో నిలవగా, వీరిలో 29 శాతం మంది కోటీశ్వరులే. ఆస్తులపరంగా మొదటి పది స్థానాలలో అవిభక్త కొరాపుట్ జిల్లా నుంచి ఇందిరానందో (బీజేడీ), తారాప్రసాద్ బాహినీపతి (కాంగ్రెస్) ఉన్నారు. ఒడిశా ఎన్నికల పరిశీలన, ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం (ఏడీఆర్) ఈ వివరాలను వెల్లడిరచింది. అభ్యర్థుల్లో ఎక్కువ మంది ధనికులు ప్రధాన పార్టీలకు చెందిన వారు కావడం గమనార్హం. వీరిలో ఎన్నికల బరిలో ఉన్న బీజేడీ అభ్యర్థుల్లో 89 శాతం మంది కోటీశ్వరులు కాగా, బీజేపీ, కాంగ్రెస్ నుంచి 50 శాతం మంది ఉన్నారు. ఈ మూడు పార్టీల నుంచి 28 మంది చొప్పున పోటీ పడుతుండగా, బీజేడీ నుంచి 25 మంది, కాంగ్రెస్, బీజేపీ నుంచి 14 మంది చొప్పున రూ.కోట్లకు అధిపతులు ఉన్నారు. ఆప్ తరఫున 11 మంది పోటీలో ఉండగా రూ.కోటి కంటే ఎక్కువ ఆస్తులు ఉన్నవారు ఇద్దరు ఉన్నారు.
రూ.33.36 కోట్ల ఆస్తులతో దిగపొహండి బీజేడీ అభ్యర్థి విప్లవ్ పాత్రో మొదటి స్థానంలో ఉండగా, గోపాల్పూర్ బీజేడీ అభ్యర్థి విక్రమ్కుమార్ పాండా రూ.15.94 కోట్లు, ధరమ్గఢ్ బీజేపీ అభ్యర్థి సుధీర్ రంజన్ జోషి రూ.12.01 కోట్లతో తరువాత స్థానాల్లో ఉన్నారు. తొలి పది స్థానాల్లో ఉన్నవారిలో జునాగఢ్ నుంచి బీజేడీ అభ్యర్థి దివ్యశంకర్ మిశ్రా రూ.11.89 కోట్లు, జయపురం బీజేడీ అభ్యర్థి ఇందిరా నందో రూ.11.46 కోట్లు, చికిటి బీజేడీ అభ్యర్థి చిన్మయనంద శ్రీరూప్దేవ్ రూ.10.57 కోట్లు, పరాకిముడి కాంగ్రెస్ అభ్యర్థి విజయ్కుమార్ పట్నాయక్ రూ.9.41 కోట్లు, ఖారియార్ బీజేడీ అభ్యర్థి ఆదిరాజ్ మోహన్ పాణిగ్రహి రూ.7.94 కోట్లు, నవ్పడ కాంగ్రెస్ అభ్యర్థి శరత్ పట్నాయక్ రూ.7.31 కోట్లు, జయపురం కాంగ్రెస్ అభ్యర్థి తారాప్రసాద్ బాహినీపతి రూ.6.24కోట్ల విలువైన ఆస్తులు కలిగి ఉన్నారని ఏడీఆర్ తెలిపింది.