నమీబియా నుంచి ప్రత్యేక కార్గో బోయింగ్ 747 విమానంలో శనివారం ఉదయం 8 చీతాలు మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లోని ఇండియన్ ఎయిర్ఫోర్స్ స్టేషన్కు చేరుకున్నాయి. ఆ వైమానిక స్థావరంలో దిగిన వన్యప్రాణులకు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్వాగతం పలికారు. అనంతరం ఈ చీతాలను భారత వైమానిక దళానికి చెందిన చినూక్ హెలికాప్టర్లో కునో నేషనల్ పార్క్కు తరలించారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా వదిలిపెట్టారు.దేశంలో అంతరించిపోయిన జాతుల జాబితాలో చేర్చిన ‘చీతా’లను కేంద్రం నమీబియా నుంచి భారత్కు తీసుకొచ్చారు. నమీబియా నుంచి ప్రత్యేక విమానంలో తీసుకొచ్చిన 8 చీతాలను తన పుట్టినరోజును పురస్కరించుకుని ప్రధాని మోదీ శనివారం మధ్యప్రదేశ్లోని కునో పార్కులో వదిలిపెట్టారు. దీంతో 74 ఏళ్ల తర్వాత చీతాల ఉనికి మళ్లీ భారత్లో మొదలైనట్టయ్యింది. వన్యప్రాణుల సంరక్షకుల కృషి, ప్రభుత్వ చొరవ ఫలితంగా ఈ చీతాలు భారత్కు చేరాయి.
ప్రత్యేక బోయింగ్ విమానంలో 16 గంటలు ప్రయాణించి దేశంలోకి అడుగుపెట్టాయి. చీతాల తరలింపు కోసం బీ747 జంబోజెట్ విమానాన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. ఐదు ఆడ, మూడు మగ చీతాలతో నమీబియాలోనివిండ్హోక్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన విమానం శుక్రవారం ఉదయం మధ్యప్రదేశ్లోని గ్వాలియర్కు చేరుకుంది. అక్కడి నుంచి హెలికాప్టర్లలో కునో నేషనల్ పార్కుకు వీటిని తరలించారు. నాలుగు నుంచి ఆరేళ్ల మధ్య వయసు గల ఈ చీతాలను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్తో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ కునో పార్కులోకి వదిలిపెట్టారు. వీటి కదలికలను గుర్తించడానికి రేడియో ట్రాన్సిమీటర్ల అమర్చారు. ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నా వీటి ద్వారా కదలికలను గుర్తించవచ్చు. చీతాలను తొలుత నెల రోజులపాటు క్వారంటైన్ ఎన్క్లోజర్లో ఉంచుతారు. వాటి ఆరోగ్యం, జీవన శైలిని సమీపం నుంచి పరిశీలిస్తారు.చీతాల సంరక్షణ అంశంపై ఈ ఏడాది జులై 20న నమీబియా, భారత్లు పరస్పర అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి.