అశ్లీల వీడియోల వ్యవహారంలో జేడీ(ఎస్) కీలక నిర్ణయం తీసుకుంది. కర్నాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ప్రజ్వల్ రేవణ్ణపై వేటు వేస్తున్నట్టు ఆ పార్టీ మంగళవారం అధికారికంగా వెల్లడించింది. పలువురు మహిళలపై లైంగిక దౌర్జన్యాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ యువ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ, ఆయన తండ్రి మాజీ మంత్రి హెచ్డీ రేవణ్ణలను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని నిర్ణయించినట్టు మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి అంతకుముందు వెల్లడించారు. సొంతపార్టీ నేతల నుంచే డిమాండ్లు వెల్లువెత్తడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. ప్రజ్వల్ రేవణ్ణను పార్టీ నుంచి బహిష్కరించే విషయంలో నిర్ణయం తీసుకున్నామని, మంగళవారం హుబ్బళ్లిలో జరిగే జేడీఎస్ కోర్ కమిటీ సమావేశంలో దీనిపై చర్చించి ప్రకటన చేస్తామని పేర్కొన్నారు. ఇక లోక్సభ ఎన్నికలకు ముందు ప్రజ్వల్ రేవణ్ణ వ్యవహారం కర్నాటకలో తీవ్ర కలకలం రేపింది. సోషల్ మీడియాలో ప్రజ్వల్ రేవణ్ణ అశ్లీల వీడియోలు వైరల్ అయ్యాయి. మరోవైపు ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఈ వ్యవహరం కన్నడ నాట పెనుదుమారం రేపడంతో ప్రజ్వల్ రేవణ్ణను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని జేడీఎస్ నిర్ణయించింది.