మారని సీపీఐ ఎన్నికల గుర్తు
మూడుసార్లు మారిన కాంగ్రెస్, బీజేపీ గుర్తులు
ఎన్నికల్లో పోటీ చేసే పార్టీల అభ్యర్థులకు ఒకే ఎన్నికల గుర్తును ఎన్నికల సంఘం కేటాయిస్తుంది. తమ గుర్తులను జనంలోకి తీసుకువెళ్లేందుకు రాజకీయ పార్టీలు నిరంతరం శ్రమిస్తూనే ఉరటాయి. అయితే వాటి గుర్తుల వెనుక పెద్ద చరిత్రే ఉంది. 77 ఏళ్ల భారతదేశ రాజకీయ చరిత్రలో మొట్టమొదటి ఎన్నికల నుంచి ఇప్పుడు జరుగుతున్న 18వ లోక్సభ ఎన్నికల వరకూ పార్టీ ఎన్నికల గుర్తు మారనది ఒక్క భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ)దే. అప్పటి నుంచి ఇప్పటి వరకు సీపీఐ ఎన్నికల గుర్తు కంకీకొడవలినే. ఈ గుర్తు ఆ పార్టీకి కచ్చితంగా సరిపోతుంది. పొలాలలో పనిచేసి జీవనోపాధి పొందే రైతులు, వ్యవసాయ కార్మికులు, కూలీలు, పరిశ్రమలలో పనిచేసే కార్మికులు, ఇతర శ్రామిక జనపక్ష పాతి సీపీఐ కనుక కంకీ
కొడవలిని ఎన్నికల గుర్తుగా ఆ పార్టీ ఎంపిక చేసుకుంది. అదే గుర్తు మారకుండా ఇప్పటి వరకు ఎన్నికల్లో పోటీచేస్తున్న ఏకైక పార్టీ సీపీఐనే.
ఇతర జాతీయ పార్టీలు ముఖ్యంగా నేటి అధికార, ప్రతిపక్ష పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ ఎన్నికల గుర్తుల్లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ జోడెద్దులు-నాగలి గుర్తుతో తన రాజకీయ ప్రస్తానాన్ని ప్రారంభించగా, బీజేపీ ఎన్నికల గుర్తు మొదట్లో దీపం. 1952 ఎన్నికల నుంచి జోడెద్దులునాగలి గుర్తుతో ఎన్నికలలో పోటీ చేసింది. భారత జాతీయ కాంగ్రెస్ (ఐఎన్సీ) నుంచి ఇందిరా గాంధీ 1969 నవంబరు 12న విడిపోయి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్-ఆర్ (రిక్విజినిస్ట్సు) ఏర్పాటు చేశారు. అప్పుడు అసలైన కాంగ్రెస్ను కొద్దికాలం ఐఎన్సి-ఓ (ఆర్గనైజేషన్)గా పిలిచారు. కామరాజ్ నేతృత్వంలో పాత పార్టీలో మిగిలిపోయన కొంతమంది జోడెద్దులు
నాగలి గుర్తును కొనసాగించుకోగా, ఇందిరా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ (ఆర్) ఆవుదూడ గుర్తుపై ఎన్నికలలో పోటీచేసింది. 1971 సాధారణ ఎన్నికల్లో ఆ పార్టీ 352 లోక్సభ స్థానాల్లో గెలుపొంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ఆ తరువాత తన పార్టీని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఐ)గా మార్చుకుని 1977 ఎన్నికల్లోకి పోటీచేశారు. కాలక్రమేణా ఇదే పార్టీ భారత జాతీయ కాంగ్రెస్గా మారింది. ఎన్నికల గుర్తు కూడా హస్తం గుర్తుగా మార్చుకుంది. 1952 నుంచి రెండున్నర దశ్దాల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గుర్తులు మూడు మారాయి.
ప్రస్తుతం కేంద్రంలో అధికారంలోవున్న ఎన్డీయే కూటమికి నేతృత్వంవహిస్తున్న బీజేపీ ఇందుకు ఏమీ తక్కువ తినలేదు. ఆ పార్టీ కూడా తన రాజకీయ గమనంలో మూడు సార్లు ఎన్నికల గుర్తులను మార్చుకుంది. 1951లో భారతీయ జనసంఫ్ు పేరుతో ఉన్న ఆ పార్టీ 1952 ఎన్నికల్లో ఆ పార్టీ గుర్తు వెలుగుతున్న నూనె దీపం గుర్తు. 1977 వరకు ఇదే గుర్తు కొనసాగగా, 1977లో ఇతర పార్టీలతో కలిపి జనతా పార్టీగా మారింది. అప్పుడు ఎన్నికల గుర్తు కూడా మార్చుకుంది. నాగలి పట్టిన రైతు గుర్తుతో ఎన్నికలలో పోటీ చేసింది. మూడేళ్లకే జనతాపార్టీని రద్దు చేయడంతో బీజేపీ అవతరించింది. అప్పటి నుంచి బీజేపీ కమలం గుర్తుపై ఎన్నికల్లో పోటీ చేస్తోంది. జనతా పార్టీ నాయకులు అనేక మంది సొంతంగా పార్టీలు ఏర్పాటు చేసుకోవడంతో అనేక పార్టీలు ఉద్భవించాయి. కొంత కాలానికి ఆ పార్టీల్లో కూడా చీలికలు ఏర్పడడంతో లెక్కలేనన్నీ పార్టీలు, చెప్పలేనన్ని ఎన్నికల గుర్తులు వచ్చాయి.