ఇన్నేళ్లు తనకు అండగా నిలిచిన రాయ్బరేలీ ప్రజలనుద్దేశించి సోనియాగాంధీ ఓ భావోద్వేగ సందేశాన్ని ఫిబ్రవరి 15న పంపారు. వయస్సు, అనారోగ్యం కారణంగా ఈసారి లోక్సభకు పోటీ చేయలేని తెలియజేశారు. ‘ఈరోజు నేను ఈ స్థానంలో ఉన్నానంటే అందుకు రాయ్బరేలీ కారణమని చెప్పేందుకు గర్విస్తున్నాను. మీరు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు చేయగలిగినదంతా చేశాను. నాకు వయస్సు మళ్లింది. అరోగ్యం సహకరించడంలేదు. అందుకే లోక్సభకు పోటీ చేయడం లేదు. ఈ నిర్ణయంతో మీకు ప్రత్యక్షంగా సేవ చేయలేను. మీరెప్పుడు నా మనస్సులో నిలిచిపోతారు. నన్ను ఆదరించినట్లుగానే నా కుటుంబాన్నీ ఆదరిస్తారని ఆశిస్తున్నా. దిల్లీలో ఉన్న నా కుటుంబం మీతోనే సంపూర్ణమవుతుంది. మీరుకు నాకు అత్తింటి వారిచ్చిన అదృష్టం. మామగారు ఫిరోజ్ గాంధీని, అత్తయ్య ఇందిరా గాంధీని ఆదరించారు. ఎన్నో ఒడిదుడుకులు ఎదరైనా మన బంధం మరింత పటిష్ఠమైంది. అత్తయ్యను, భర్తను కోల్పోయిన తర్వాత మీ వద్దకు వచ్చిన నన్ను మీరు ఎంతో ఆప్యాయంగా ఆదరించారు. మీరు నాకు ఆత్మీయులు’ అని సోనియాగాంధీ పేర్కొన్నారు. రాజస్థాన్ స్థానం నుంచి రాజ్యసభకు నామినేషన్ వేసిన మరుసటి రోజు ఈ సందేశం ఓటర్లకు చేరింది. కాగా, ఇందిరా గాంధీ తర్వాత గాంధీ కుటుంబం నుంచి రాజ్యసభలో అడుగుపెట్టే రెండవ నేతగా సోనియాగాంధీ నిలిచారు. ఇందిరాగాంధీ 1964 నుంచి 1967 వరకు రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు.