Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఆదిత్యనాథ్‌పై పోటీకి సిద్ధం

పిల్లల వైద్యుడు కఫిల్‌ ఖాన్‌
లక్నో : తనకు ఏదైనా పార్టీ మద్దతు ఇస్తే ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై గోరఖ్‌పూర్‌ నుంచి పోటీ చేస్తానని పిల్లల వైద్యుడు డాక్టర్‌ కఫీల్‌ ఖాన్‌ మంగళవారం తెలిపారు. 2017 సంవత్సరంలో బీఆర్‌డీ వైద్య కళాశాలలో ఆక్సిజన్‌ లేకపోవడంతో చాలా మంది పిల్లలు మరణించిన దుర్ఘటనలో కఫీల్‌ ఖాన్‌ పేరు తెరమీదకు వచ్చింది. కాగా గత ఏడాది నవంబర్‌ 9న డాక్టర్‌ ఖాన్‌ను సర్వీసు నుంచి తొలగించారు. దానిని అతను హైకోర్టులో సవాలు చేశాడు. ‘నేను గోరఖ్‌పూర్‌లో యోగి ఆదిత్యనాథ్‌పై అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయగలను. ఏదైనా పార్టీ నాకు టికెట్‌ ఇస్తే నేను సిద్ధంగా ఉన్నాను’ అని ఖాన్‌ పీటీఐతో మాట్లాడుతూ అన్నారు. మీరు ఏదైనా పార్టీతో సంప్రదింపులు జరుపుతున్నారా, మిమ్మల్ని ఎవరైనా సంప్రదించారా అని అడిగినప్పుడు, ‘అవును చర్చలు జరుగుతున్నాయి. అన్నీ అనుకూలిస్తే నేను ఎన్నికల్లో పోటీ చేస్తాను. ఇదిలాఉండగా, గోరఖ్‌పూర్‌లో మార్చి 3న ఆరో దశలో పోలింగ్‌ జరగనుంది. 2017 ఆగస్టులో బీఆర్‌డీ వైద్య కళాశాల ఆస్పత్రిలో 80 కుటుంబాలకు చెందిన పిల్లలు మరణించిన విషాదంలో తనను బలిపశువుగా మార్చారని ఖాన్‌ ఆరోపించారు. తాను గోరఖ్‌పూర్‌లో లేనప్పటికీ, తన 70 ఏళ్ల తల్లిని పోలీసులు వేధిస్తున్నారని, తన గురించి విచారించడానికి ఇంటికి చేరుకున్నారని ఖాన్‌ తెలిపారు. ‘నేను ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ మొదలైన సామాజిక మాధ్యమాలలో క్రియాశీలంగా ఉన్నాను. అక్కడ నా ఆచూకీ గురించి చెబుతాను. ప్రస్తుతం నేను ముంబైలో ఉన్నాను. 5 వేల ప్రతులు అమ్ముడై ఉత్తమ అమ్మకంగా నిలిచిన నా పుస్తకం ‘గోరఖ్‌పూర్‌ హాస్పిటల్‌ ట్రాజెడీ-ఎ డాక్టర్స్‌ మొమెరీ ఆఫ్‌ ఎ డెడ్లీ మెడికల్‌ క్రైసిస్‌’ ప్రమోషన్‌ కోసం ఇక్కడి నుంచి హైదరాబాద్‌, బెంగళూరు వెళుతున్నాను’ అని ఆయన చెప్పారు. ‘డిసెంబర్‌ 17, 2021న నా పుస్తకాన్ని ఆవిష్కరించిన తర్వాత పోలీసులు డిసెంబర్‌ 20న నా ఇంటికి చేరుకున్నారు. ఆపై డిసెంబర్‌ 28న, మళ్లీ జనవరిలో వచ్చారు. నేను గోరఖ్‌పూర్‌లోని రాజ్‌ఘాట్‌ పోలీస్‌ స్టేషన్‌లో హిస్టరీ షీటర్‌ని అని పోలీసులు చెబుతున్నారు. ఎన్నికల కారణంగా, అటువంటి వ్యక్తుల ధృవీకరణ కొనసాగుతోంది’ అని అతను చెప్పారు. ‘వారు ధృవీకరణ చేయవలసి వస్తే, ఒక పోలీసు నా ఇంటికి వెళ్లవచ్చు. కానీ చాలా మంది పోలీసులు నా ఇంటికి చేరుకున్నారు’ అని కఫీల్‌ అన్నారు. కఫీల్‌ తల్లి, అతని సోదరుడు అదీల్‌ ఖాన్‌ కుటుంబంతో కలిసి గోరఖ్‌పూర్‌లోని బసంత్‌పూర్‌ ప్రాంతంలో నివసిస్తున్నారు. కఫీల్‌ అలీఘర్‌ ముస్లిం విశ్వవిద్యాలయంలో ఉద్వేగభరితమైన ప్రసంగం చేసినందుకుగాను 2020 జనవరిలో అరెస్టయ్యాడు. కఫీల్‌పై కఠినమైన జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఏ) కింద అభియోగాలు మోపారు. అలహాబాద్‌ హైకోర్టు అతనిపై ఎన్‌ఎస్‌ఏ అభియోగాన్ని ఉపసంహరించుకోవడానికి ముందు ఐదు నెలల జైలు జీవితం గడిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img