Tuesday, May 7, 2024
Tuesday, May 7, 2024

కర్ఫ్యూ ఆంక్షల్లోనే ఖర్గోన్‌

ఈద్‌, అక్షయ తృతీయను ఇళ్లలోనే జరుపుకున్న ప్రజలు
భోపాల్‌/ఖర్గోన్‌ : మధ్య ప్రదేశ్‌కు చెందిన ఖర్గోన్‌ నగరంలో పాలనా యంత్రాంగం మంగళవారం కర్ఫ్యూను సడలించలేదు. ఏప్రిల్‌ 10న రామనవమి ఊరేగింపు సందర్భంగా హింసకాండ చెలరేగిన ఖర్గోన్‌లో ఈద్‌-అల్‌-ఫితర్‌, అక్షయ తృతీయ పండుగలను ఇంటి వద్ద జరుపుకోవాలని ప్రజలను కోరింది. ఖర్గోన్‌లో భద్రతను కట్టుదిట్టం చేశామని, మంగళవారం నగరంలోని అన్ని మతపరమైన ప్రదేశాలను మూసివేశామని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో అన్ని వర్గాల ప్రజలు తమ ఇళ్లలోనే పండుగలు జరుపుకునేందుకు అంగీకరించారు. నగరంలో శాంతి భద్రతలను కాపాడేందుకు మంగళవారం కర్ఫ్యూలో ఎలాంటి సడలింపు ఉండదని సబ్‌ డివిజనల్‌ మేజిస్ట్రేట్‌ మిలింద్‌ ధోక్‌ సోమవారం రాత్రి విలేకరులతో చెప్పారు. అంతకుముందు, పాలనా యంత్రాంగం మే 2, 3 తేదీలలో 24 గంటల కర్ఫ్యూను ప్రకటించింది. అయితే సోమవారం దానిని తొమ్మిది గంటల పాటు సడలించింది. ఇండోర్‌ డివిజనల్‌ కమిషనర్‌ పవన్‌ శర్మ, ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ రాకేశ్‌ గుప్తా ఆదివారం రాత్రి ఖర్గోన్‌కు చేరుకుని అధికారులతో సమావేశమయ్యారు. నగరంలో భద్రతను కట్టుదిట్టం చేసేందుకు మొబైల్‌ యూనిట్లతో సహా అదనపు బలగాలను మోహరించినట్లు ఖర్గోన్‌ ఇన్‌ఛార్జ్‌ పోలీసు సూపరింటెండెంట్‌ (ఎస్పీ) రోహిత్‌ కష్వానీ విలేకరులకు తెలిపారు. నగరంలో పరిస్థితిని పర్యవేక్షించేందుకు డ్రోన్‌ కెమెరాలు, 171 సీసీటీవీలను ఏర్పాటు చేశారు. అలాగే కర్ఫ్యూను ఉల్లంఘించే వారి కోసం తాత్కాలిక జైళ్లను ఏర్పాటు చేసినట్లు వివరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img