బీజేపీ ఎంపీ సుశీల్కుమార్ మోదీ
న్యూదిల్లీ : కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (కేవీఎస్)లోని 7,880 ఎంపీ కోటా సీట్లను ‘ప్రజాస్వామ్య స్ఫూర్తికి’ విరుద్ధంగా ఉన్నందున వాటిని రద్దు చేయాలని బీజేపీ సీనియర్ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ బుధవారం రాజ్యసభలో డిమాండ్ చేశారు. జీరో అవర్లో ఈ విషయాన్ని లేవనెత్తిన మోదీ, ప్రతి ఒక్క పార్లమెంటు సభ్యుడు కేవలం 10 మంది విద్యార్థులను మాత్రమే సిఫార్సు చేయగలరని, తమ పిల్లల అడ్మిషన్ కోసం తమను సంప్రదించిన వేలాది మందిని నిరాశపరచవలసి వస్తుందన్నారు. ఎంపీలు ఎన్నికల్లో ఓడిపోవడానికి కేవీఎస్లోని ఎంపీ కోటా కూడా ఒక ప్రధాన కారణమని అన్నారు. ‘ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం.. కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఐఐటీలు, ఐఐఎంలలో ఎంపీలకు ఎలాంటి హక్కులు ఇవ్వనప్పుడు, వారు దానిని కేవీఎస్లో ఎందుకు కలిగి ఉండాలి’ అని ప్రశ్నించారు. పేద, సామాన్యులు లబ్ధి పొందే విధంగా ప్రతిభావంతులైన విద్యార్థులకు సీట్లు తెరిచి ఉంచాలని మోదీ అభిప్రాయపడ్డారు. తాను చాలా మంది తోటి ఎంపీలతో మాట్లాడానని, వారు కూడా ఈ కోటాను ముగించాలని కోరుకుంటున్నారని మోదీ తెలిపారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇప్పటికే తన ఎంపీ కోటాను సరెండర్ చేశారని చెప్పారు.