134 స్థానాల్లో విజయం..
బీజేపీ కంచుకోటను ఆమ్ ఆద్మీ పార్టీ బద్దలు కొట్టింది. దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ఘన విజయం సాధించింది. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ దిల్లీలోని 250 వార్డుల్లో.. 134 స్థానాల్లో ఆప్ అభ్యర్ధులు తిరుగులేని మెజారిటీ సాధించారు. ఆప్కు గట్టి పోటీ ఇచ్చిన బీజేపీ 104 స్థానాల్లో గెలుపొందింది. అయితే గత 15 ఏళ్లుగా ఎంసీడీ అధికారంలో ఉన్న బీజేపీకి ఆప్ గట్టి షాకిచ్చింది. 9 చోట్ల కాంగ్రెస్ అభ్యర్ధులు గెలిచారు. మూడు స్థానాల్లో ఇండిపెండెంట్ అభ్యర్ధులు విజయం సాధించారు. దిల్లీ అసెంబ్లీ ఎన్నికల తరువాత మున్సిపల్ ఎన్నికల్లో కూడా విజయం సాధించడంతో పార్టీ నేతలు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
250 వార్డుల్లో..
ఆప్ – 134
బీజేపీ – 104
కాంగ్రెస్- 9
ఇండిపెండెంట్ అభ్యర్థులు- 3
ఆప్ ఘన విజయంతో.. దిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం ఎదుట సంబరాలు మిన్నంటాయి. సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం సిసోడియా, పంజాబ్ సీఎం భగవంత్మాన్ పార్టీ కార్యాలయానికి చేరుకుని కార్యకర్తలతో కలిసి సంబరాల్లో పాల్గొన్నారు. భారీ సంఖ్యలో కార్యకర్తలు కూడా ఆప్ కార్యాలయానికి చేరుకుని పార్టీ గెలుపు పట్ల సంతోషం వ్యక్తంచేస్తున్నారు.
ఐ లవ్ యూ దిల్లీ.. కేజ్రీవాల్
దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గత 15 ఏళ్ల నుంచి బీజేపీ అధికారంలో ఉంది. తొలిసారి బీజేపీపై ఆప్ తిరుగులేని ఆధిక్యత సాధించింది. ఎంసీడీ ఎన్నికల ఫలితాలపై పార్టీ నేతలతో సమీక్ష నిర్వహించారు దిల్లీ సీఎం కేజ్రీవాల్. ఆప్ విజయం పట్ల సంతోషం వ్యక్తంచేశారు. ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన దిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.. ఐ లవ్ యూ టూ దిల్లీ అని పేర్కొన్నారు. దిల్లీ ప్రజలను అభినందిస్తున్నానని.. మార్పు తీసుకొచ్చినందుకు వారికి ధన్యవాదాలంటూ పేర్కొన్నారు.దిల్లీ ఎంసీడీని అవినీతి రహితంగా మార్చేందుకు సహకరించాలని ప్రతిపక్ష పార్టీలకు, ప్రధాని నరేంద్ర మోదీకి కేజ్రీవాల్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు దిల్లీ కోసం పని చేసేందుకు బీజేపీ, కాంగ్రెస్ల సహకారం కావాలని కోరుకుంటున్నాని తెలిపారు. దిల్లీని బాగు చేసేందుకు కేంద్రానికి విజ్ఞప్తి చేయడంతోపాటు.. ప్రధాని ఆశీస్సులు కోరుతున్నాననంటూ కేజ్రీవాల్ పేర్కొన్నారు.