న్యూఢల్లీి : ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ వ్యంగ్యబాణం సంధించారు. ‘‘మీరు దేశ ప్రజల మన్ కీ బాత్ను అర్థం చేసుకుంటే… దేశంలో వాక్సినేషన్ పరిస్థితి ఇలా ఉండేదే కాదు’’ అంటూ రాహుల్ ట్వీట్ చేశారు. ప్రధాని మన్కీబాత్ ప్రసంగం ప్రసారం కావడానికి ముందు రాహుల్ ట్వీట్ వచ్చింది. దేశంలో కరోనా టీకా మందకొడిగా సాగడంపై రాహుల్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. టీకాల రేటుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఆయన ‘‘వేర్ అర్ వాక్సిన్స్’’ అనే హ్యాష్ట్యాగ్ను ఉపయోగించారు. వాక్సిన్ నత్తనడకను ఎత్తి చూపే మీడియా క్లిప్పింగ్స్తో కూడిన వీడియోను ఆయన ట్విట్టర్లో పంచుకున్నారు. కరోనా మూడో దశను ఎదుర్కొనడానికి డిసెంబర్ 2021 నాటికి 60 శాతం జనాభాకు టీకా రెండు డోసులు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ దేశంలో టీకా సమీకరణను నత్తనడకన సాగుతుండటాన్ని ఈ వీడియో హైలైట్ చేసింది. రోజుకు అవసరమైన టీకా రేటు 9.3 మిలియన్లు (93 లక్షలు) కాగా గత ఏడు రోజులలో సేకరించిన టీకాలు రోజుకు సగటున 3.6 మిలియన్లు మాత్రమే. ఈ లెక్కన ఏడు రోజుల్లో రోజుకు 5.6 మిలియన్ల వాక్సిన్ డోసుల కొరత నెలకొంది. కేంద్ర ప్రభుత్వ టీకా విధానం, టీకా కార్యక్రమం నెమ్మదిగా సాగడంపై కాంగ్రెస్ పార్టీ మోదీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తోంది.