ముంబై: ఎల్గార్ పరిషత్`మావోయిస్టులతో సంబంధాల కేసులో విరసం నేత వరవరరావు, మరో ఇద్దరు హక్కుల కార్యకర్తలకు బెయిల్ ఇవ్వడానికి బోంబే హైకోర్టు బుధవారం నిరాకరించింది. గతంలో తమకు బెయిల్ నిరాకరిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను సమీక్షించాలని కోరుతూ వరవరరావు, మరో ఇద్దరు దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. గతంలో తామిచ్చిన తీర్పులో తప్పిదాలు ఉన్నట్లు గుర్తిస్తేనే పిటిషన్ను సమీక్షకు తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టంచేసింది. ఈ పిటిషన్పై సమీక్షించాల్సిన అవసరం లేదని జస్టిస్ ఎస్ఎస్ షిండే, జస్టిస్ ఎన్జే జమదర్లతో కూడిన ధర్మాసనం తెలిపింది. ఇంతకుముందు హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ వరవరరావు, అరుణ్ఫెరీరా, వెర్నాన్ గొన్సాల్వెస్ పిటిషన్ వేశారు. వరవరరావు ప్రస్తుతం ఆరోగ్య కారణాలతో బెయిల్పై బయట ఉండగా మిగిలిన ఇద్దరూ జైలులో ఉన్నారు. వరవరరావు షరతులతో కూడిన బెయిల్పై ముంబైలో ఉంటున్నారు. ముగ్గురి బెయిల్ను దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ తీవ్రంగా వ్యతిరేకించింది.