జార్ఖండ్ హైకోర్టు
రాంచీ : జార్ఖండ్లోని ధన్బాద్ అదనపు సెషన్స్ న్యాయమూర్తి ఉత్తమ్ ఆనంద్ హత్య కేసులోని ముగ్గురు వ్యక్తులను గుర్తించలేని సీబీఐ అసమర్థతపై ఆ రాష్ట్ర హైకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ప్రమాదం జరిగిన తర్వాత ఘటనాస్థలం నుంచి ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా దాటడం సీసీటీవీ ఫుటేజ్లో లభించింది. వారెవరన్నదీ సీబీఐ గుర్తించలేకపోవడంతో జార్ఖండ్ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. సీబీఐ దాఖలు చేసిన నివేదికను చదివిన కోర్టు.. ఈ కేసులో అరెస్టైన ఆటో డ్రైవర్, అతడి స్నేహితుల మూత్రం, రక్త నమూనాలను ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీ (ఎఫ్ఎస్ఎల్) పరీక్షల్లో వారు మత్తులో లేరని తేలడాన్ని పరిశీలించింది. ‘ జడ్జిని వాహనంతో ఢకొట్టిన ప్రాంతాన్ని దాటిన ముగ్గురు వ్యక్తులను సీబీఐ గుర్తించలేకపోవడం విచారకరం. సీబీఐ ఓ ప్రొఫెషనల్ ఏజెన్సీ అయినప్పటికీ సంస్థ చర్య పట్ల తీవ్ర నిరాశతో ఉన్నాం’ అని ప్రధాన న్యాయమూర్తి రవి రంజన్, సుజిత్ నారాయణ ప్రసాద్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. 49 ఏళ్ల జడ్జి ఉత్తమ్ ఆనంద్ జులై 28న మార్నింగ్ వాక్ చేస్తుండగా.. వెనక నుండి ఓ ఆటో గుద్దేయడంతో చనిపోయిన సంగతి తెలిసిందే.