Friday, April 26, 2024
Friday, April 26, 2024

అగ్ని ప్రమాదాలపై ప్రభుత్వ మొద్దు నిద్ర

డా యం.సురేష్‌బాబు

సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లోని 4,5,6, 7, 8వ అంతస్తుల్లో రెండు రోజుల క్రితం భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది..ఘటనాస్థలానికి చేరుకున్నాయి. పది ఫైర్‌ ఇంజిన్లతో మంటలను ఆర్పుతున్న, దట్టమైన పొగలు కమ్ముకోవడంతో మంటలు ఆర్పేందుకు ఫైర్‌ సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. స్వప్న కాంప్లెక్స్‌ లోపల ఆరుగురు యువకులు మంటల్లో చిక్కుకొని మరణించారు. భవనంపై నుంచి కొందరు వ్యక్తులు తమ ఫోన్లలో లైట్‌చూపిస్తూ తమను కాపాడాలని ఆర్తనాదాలు చేశారు. గత నెలలో నల్లగుంటలోని స్పోర్ట్స్‌ షాప్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. గత సంవత్సరం సికింద్రాబాద్‌ క్లబ్‌లో జరిగిన అగ్ని ప్రమాదానికి క్లబ్‌ పూర్తిగా కాలిబూడిదైంది. ఈ హోటల్లో జరిగిన అగ్నిప్రమాదంలో మొత్తం 8మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం వెనుక అసలు కారణాలను అగ్నిమాపకశాఖ వివరించింది. సెల్లార్‌లో ఉన్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌లో ముందు ఫైర్‌ వచ్చిందని.. అందులోని బ్యాటరీలు పేలిపోవడంవల్ల మంటలు వ్యాపించాయని తెలిపింది. మూడు గంటల పాటు మంటలు ఆర్పేందుకు శ్రమించారు.
బోయిగూడ గుజిరీ గోదాములో జరిగిన అగ్ని ప్రమాదంలో బీహార్‌ రాష్ట్రానికి చెందిన పదుకొండుమంది మృతిచెందారు. ఒకరు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. దేశంలో పారిశ్రామిక ప్రమాదాల నివారణకు ప్రత్యేకంగా పారిశ్రామిక భద్రతా విధానాన్ని తీసుకురాకుండా, అసంఘటిత రంగాల్లో పనిచేసే కార్మికులకు మెరుగైన వసతి కేంద్రాలు ఏర్పాటు చేయడంలో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు శ్రద్ద వహించక పోవడంతో కార్మికుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. మృతుల కుటుంబాలకు ఇన్సూరెన్స్‌, ఎక్స్‌గ్రేషియా, కాంపెన్సేషన్‌ దొరకడం లేదు. పరిశ్రమల భద్రతకోసం అలాగే పదిమంది కంటే ఎక్కువ కార్మికులు పనిచేసేచోట బలమైన రెగ్యులేటరీ వ్యవస్థను రూపొందించాలి. ప్రస్తుతమున్న రెగ్యులేటరీ వ్యవస్థ ఎందుకూ పనికిరాకుండా పోయింది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినచర్యలు తీసుకునేలా విధానాలు రూపొందించాలి. ఫ్యాక్టరీలపై బలమైన పర్యవేక్షణ యంత్రాంగం, థర్డ్‌ పార్టీ తనిఖీలు ఉండడంలేదు. ఎవరైనా ప్రమాదంలో మరణిస్తే రూ.50 లక్షల పరిహారం ఇచ్చేలా చూడాలి అలాగే జనావాసాలలో పరిశ్రమలు, గోదాములు, రద్దీ ప్రదేశాలలో ప్రజలకు ఇబ్బంది కలిగించే పరిశ్రమల పట్ల ప్రభుత్వం కొరడా రaుళిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పారిశ్రామిక ప్రమాదాలు, గోదాములు, గుజరీ, తుక్కు వ్యాపార సముదాయాలల్లో నివారణచర్యలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించక ఏండ్లు గడుస్తుంది. ప్రమాదాలు జరిగిన తర్వాత పనికిమాలిన సెక్షన్లు విధించి యజమానులలను వదిలేస్తున్నారు తప్ప కఠినమైన నిర్ణయాలు తీసుకోవడంలేదు. ప్రతి నెల పరిశ్రమల్లో భద్రత, ప్రమాదాలు, కాలుష్య నివారణ అంశాలపై విస్తృతంగా చర్చించి నివారణోపాయాలు వెదకాలి. కొత్తగా ఇండస్ట్రియల్‌ సేఫ్టీ పాలసీ తీసుకువచ్చి, పరిశ్రమల భద్రతకోసం ప్రస్తుతమున్న రెగ్యులేటరీ వ్యవస్థలన్నీ పటిష్టంచేయాలి. దాదాపు డెబ్భైశాతం వాణిజ్య సముదాయాలు, షాపులు, గోదాములలో ఫైర్‌ ఎక్సటెంగ్విషర్లు ఉండడం లేదు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లోని పరిశ్రమలు, ఇండస్ట్రియల్‌ పార్కులను హై రిస్క్‌ జోన్లను గుర్తించాలి. ఏయే ప్రాంతాల్లో ఎలాంటి పరిశ్రమలు ఉన్నాయన్న వివరాలు ఇండస్ట్రియల్‌ అట్లాసులో పొందుపరచాలి. పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకునే వారు కూడా.. కేటగిరీ ప్రకారం ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలో నిర్ణయించుకునేలా వివరాలుండాలి. పరిశ్రమలు సమ్మతి నివేదికలను ఏడాదికి రెండుసార్లు ఇచ్చేలా చూడాలి. స్థానిక రెసిడెన్షియల్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ వారిని ఇండస్ట్రియల్‌, గోదాముల సేఫ్టీ సంఘంలో బాధ్యులుగా చేర్చాలి. వీటిపై ఎలాంటి చర్యలు తీసుకున్నామన్న అంశాన్ని సంబంధిత కంపెనీలు బోర్డులపై ప్రదర్శించాలి. థర్డ్‌పార్టీ తనిఖీలు కూడా వీటిపై ఉండాలి. కేవలం పరిశ్రమల్లోనే కాకుండా ఇండస్ట్రియల్‌ పార్కుల్లో కూడా నిబంధనలు అమలవుతున్నాయా? లేదా? చూడాలి. పర్యవేక్షణ యంత్రాంగం బలంగా ఉండాలి. ఇప్పుడు జరిగిన దుర్ఘటనలో నిరోధకాలు ఉంటే ఆ ప్రమాదం జరిగేదికాదు. ఎవ్వరూ పర్యవేక్షణ చేయకపోవడంవల్లే ఈ సమస్య వచ్చింది. పాశ్చాత్య దేశాల్లో కాంప్లియన్స్‌ నివేదిక ఇవ్వకపోతే భారీ జరిమానాలు వేస్తారు. కానీ, మన దగ్గర అలాంటి పరిస్థితిలేదు. మనం కూడా ఇలాంటి విషయాల్లో కఠినంగా ఉండాలి. పారిశ్రామిక ప్రమాదాలకు బాధ్యులైన వారిపట్ల కఠినంగా వ్యవహరించాలి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img