Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

శాస్త్రీయ దృక్పధం పెంపొందాలి

నేటి మానవ ప్రపంచంలో చోటు చేసుకుంటున్న విపరీత పోకడలను పరిత్యజించాలి. శాస్త్రబద్ధమైన ఆలోచనలకు విలువివ్వాలి. విజ్ఞానం ఒక అనంతమైన సాగరం. విజ్ఞాన సాగరాన్ని మధించి విలువైన జ్ఞానసంపదను వెలికితీసి, జనహితంకోసం వినియోగించడం లోనే మానవ విజ్ఞతకు పరిపక్వత చేకూరుతుంది. విజ్ఞానం మానవ వినాశనానికిదారితీయడం అత్యంతదారుణం. అణ్యాయుధ ప్రయోగాల వలన హీరోషిమా, నాగసాకి వంటి నగరాలు విధ్వంసమైపోయాయి. హీరోషిమా, నాగసాకి నగరాల్లో జరిగిన అపారనష్టం మన స్మృతి పథం నుండి ఈనాటికీ చెరిగిపోలేదు. ఈనాటికీ ఈ అణు ప్రభావం వలన అక్కడి ప్రజలు దుష్ఫరిణామాలు ఎదుర్కొంటూనే ఉన్నారు. మొదటి,రె రెండవ ప్రపంచ యుద్ధాలు సృష్టించినవిలయాన్ని చరిత్ర మరచిపోలేదు. అయినా ఇంకా ప్రపంచంలో ఆధిపత్యంకోసం అనాగరిక మారణహోమం కొనసాగడం విజ్ఞానమా?అజ్ఞానమా? ఇరు దేశాలకు పరిమితం కావలసిన ఒక చిన్న సమస్య అమెరికా అరంగేట్రం వలన భీకర యుద్ధానికి దారితీసింది. రష్యా, ఉక్రెయిన్ల మధ్య ఏడాదిగా కొనసాగు తున్న యుద్ధంలో లక్షలాది మంది ప్రజలు, సైనికులు చనిపోయారు. ఉక్రెయిన్‌ సర్వనాశనమై పోయింది. రష్యా ఆర్ధికంగా తీవ్రంగా నష్టపోయింది. యుద్ధాల వలన ఏ దేశానికి లబ్ధి చేకూరదు. యుద్ధాల్లో ఎవరు గెలిచినా, ఓడినా ఉభయపక్షాలను పరాజితులుగానే భావించాలి. యుద్ధాల్లో అంతిమ బాధితులు ప్రజలే నన్న సత్యం మరవరాదు. ఇలాంటి ఆధిపత్య ధోరణులకు స్వస్తి చెప్పాలి. విజ్ఞానంవలన సమకూరిన ఆయుధాలు మారణహోమానికి వినియోగించడం అవాంఛనీయం. విజ్ఞానం మానవాళి జీవితాలను సుఖమయం చేయాలి. ప్రజల అవసరాలకు బాసటగా నిలవాలి. ఆకలి, దరిద్రం, అవిద్య వంటి సమస్యల నుండి గట్టెక్కించి ప్రజల జీవన ప్రమాణాలను పెంచాలి. భూగోళ, ఖగోళ అధ్యయనాలు, శాస్త్రీయ పరిశోధనా ఫలితాల వలన ఏర్పడిన నూతన ఆవిష్కరణలు విశ్వ సమాజ ప్రగతికి దోహదంచేయాలి. నాగరికతపెరిగిన నేపథ్యంలో ప్రపంచం అరచేతిలో ఇమిడి పోయినట్టుగా రూపాంతరం చెందిన వర్తమానంలో సైన్స్‌ వినియోగం వివేకంతో సాగాలి. సైన్స్‌ లేనిదే పూట గడవని ప్రస్తుత పరిస్థితులను, గతకాలం నాటి పరిస్థితులను రేఖా మాత్రంగానైనా ఒకసారి స్ఫృశించి, విశ్లేషిద్ధాం.
అడవుల్లో ఆకులు, అలాలు తింటూ, మనిషికీ, జంతువుకీ మధ్య వ్యత్యాసం లేని రాతియుగం నుండి, ఆదిమానవ ప్రస్థానం నుండి ఆధునిక మానవ పరివర్తనం వరకు అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. నేడు మనం అనుభవిస్తున్న సైన్స్‌ ఫలాల వెనుక ఎంతటి చరిత్ర ఉందో గమనించాలి. నాటి మూఢవిశ్వాసాల నుండి మతాధికారుల దుర్మార్గాల నుండి ప్రజలను కాపాడడానికి ఎంతో మంది శాస్త్రవేత్తలు అహరహం శ్రమించారు. తమ జీవితాలను పణంగా పెట్టి ప్రజలజీవితాల్లో విజ్ఞానకాంతులను విరబూ యించారు. సైన్స్‌కు మత మౌఢ్యానికి మధ్య జరిగిన సంఘర్షణలో ఎంతో మంది శాస్త్రవేత్తలు ఎన్నో శిక్షలకు గురైనారు. ఎంతో మంది నిర్దాక్షిణ్యంగా హతులైనారు. నిజం చెబితే దైవద్రోహంగా పరి గణించడం, పరిశోధనలు చేస్తే కఠిన శిక్షలు అమలు చేయడం వంటి అత్యంత దారుణమైన పరిస్థితులున్న నాటి కాలంలో తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా వదిలేసి, శాస్త్రీయ ఫలితాలతో రాబోయే తరాలకోసం శ్రమించి, దారుణంగా బలైపోయిన అలనాటి శాస్త్రవేత్తల చరిత్రను పరిశీలించి, శాస్త్రీయకోణంలో ఆలోచించడం ద్వారా ఈ ఆధునికంలో విస్తరిస్తున్న అంధ విశ్వాసాలకు, మూఢత్వ భావాలకు, మూర్ఖ సిద్ధాంతాలకు స్వస్తి చెప్పవచ్చు.
అరిస్టాటిల్‌ను విజ్ఞానానికే పర్యాయ పదంగా అప్పట్లో పేర్కొనేవారు. అరిస్టాటిల్‌ గ్రంథాలను విమర్శించడం మతద్రోహంగా భావించి శిక్షించేవారు. గురుశిష్యులైన గ్రీకు తత్త్వ వేత్తలు ప్లేటో, అరిస్టాటిల్‌లు విశ్వానికి భూమి కేంద్రమనే ప్రతిపాదనలను బలిపరిచారు. విశ్వం అనంతమైనదని, ఇతర గ్రహాల్లో కూడా జీవం ఉండే అవకాశాలున్నాయని, సూర్యుడు విశ్వానికి కేంద్రమని ఆధునిక విజ్ఞానానికి పునాదులు వేసిన ‘‘బ్రూనో’’ మత పెద్దల కోపాగ్నికి గురయ్యాడు. తర్కానికి, హేతువాదానికి, శాస్త్రీయ దృక్ఫథానికి ప్రాధాన్యత నిచ్చే కోణంలో ఆలోచించాలని పేర్కొంటూ, సత్యం కోసం పోరాడిన బ్రూనో ఒక గొప్ప తత్వ,గణిత శాస్త్రవేత్త. ఆయన సత్య శోధనకు అప్పటి మత మౌఢ్యం అనేక సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. అయినా సత్య పథాన్ని విడనాడక పోరాడిన బ్రూనోను కర్కశంగా సజీవ దహనం చేసారు. బ్రూనో సజీవ దహన మైనా అతని ఆలోచనలు సజీవంగానే ఉన్నాయి.
గ్రీకు తత్వవేత్త, విజ్ఞానగని సోక్రటీస్‌ను కూడా నిజాలను నిర్భయంగా చెప్పినందుకు విషమిచ్చి చంపారు. ఇలా ఒకరు కాదు…ఎందరో… మరెందరో నాటి మతపెద్దల మూఢనమ్మకాలకు బలైపోయి, ప్రపంచానికి తమ త్యాగాల ద్వారా సైన్స్‌వెలుగులను ప్రసాదించారు. ప్రస్తుత ప్రపంచంలో ఇంకా పనికిరాని మూఢవిశ్వాసాలు జన జీవితాలను శాసిస్తున్నాయి. ఇకనైనా శాస్త్రీయతలేని సమాజానికి హాని కలిగించే మూఢ నమ్మకాలను విడిచిపెట్టాలి. మత సంబంధమైన విశ్వాసాలను వ్యక్తిగత మైనవిగా భావించాలి. ఆధ్యాత్మికత విలువలు పెంపొందించడానికి, మంచిని ప్రోది చేయడానికి వినియోగపడాలి. మానవ ఎదుగుదలను ఆపే అంధవిశ్వాసాలను ప్రోత్సహించడం ఆధునిక విజ్ఞానానికి తలవంపులు తెచ్చే అవాంఛనీయమైన పోకడలుగా గుర్తించాలి. మతాల్లోని మంచిని, విలువలను స్వీకరించాలి. ఇదే సందర్భంలో మూఢ భావాలకు చరమ గీతం పాడాలి. శాస్త్రీయ పరిశోధనా ఫలితాలను అనుభవిస్తూ, సైన్సును తప్పుబట్టడం అవివేకం,అజ్ఞానం.
సుంకవల్లి సత్తిరాజు. మొ: 9704903463.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img