Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఐపీఎల్‌ వల్లే టీమిండియా ఇలా..!

కపిల్‌ ఆవేదన

న్యూదిల్లీ : టీ20 ప్రపంచకప్‌లో కనీసం సెమీ ఫైనల్‌ చేరకుండానే టీమిండియా ఇంటిముఖం పట్టిన నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్‌ కపిల్‌ దేవ్‌ స్పందించాడు. కొంతమంది ఆటగాళ్లు దేశం కంటే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)కు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తుండటం వల్లే టీమ్‌ఇండియా పరిస్థితి ఇలా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌ లో భారత్‌ కనీసం సెమీస్‌ కూడా చేరకుండా నిష్క్రమించడం బాధాకరమన్నాడు. భారత క్రికెట్‌ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ షెడ్యూల్‌ ఖరారు చేయాలని సూచించారు. ఐపీఎల్‌-2021 మలి దశ ముగిసిన తర్వాత ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చి ఉంటే బాగుండేదని పేర్కొన్నారు. ఐపీఎల్‌ ఫ్రాంఛైజీల కోసం భారత క్రికెట్‌ను పణంగా పెట్టొద్దని కపిల్‌ సూచించాడు. ‘ఆటగాళ్లు భారత జట్టుకు ఆడటం కంటే ఐపీఎల్‌లో ఆడటానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటే.. వారికి మనమేం చెప్పగలం?. వారి ఆర్థిక పరిస్థితుల గురించి నాకు తెలియదు. కానీ, దేశం తరఫున ఆడటాన్ని ఆటగాళ్లంతా గౌరవంగా భావించాలి. నేనైతే టీమిండియా తరఫున ఆడేందుకే మొదటి ప్రాధాన్యమిస్తా. ఆ తర్వాతే ఏదైనా. ఐపీఎల్‌లో ఆడొద్దని నేను చెప్పను. ఐపీఎల్‌ వల్లే చాలామందికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. కానీ, దాన్ని ఆటగాళ్లు సక్రమంగా ఉపయోగించుకోలేపోతున్నారు. కాబట్టి, మ్యాచ్‌ల షెడ్యూలింగ్‌ విషయంలో బీసీసీఐ జాగ్రత్తగా వ్యవహరించాలి. టీమ్‌ఇండియా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని టోర్నమెంట్లను ఖరారు చేయాలి. టీ20 ప్రపంచకప్‌ నుంచి భారత్‌ నిష్క్రమించడం బాధాకరమే. అయినా, ఇప్పటికీ మించిపోయిందేం లేదు. రానున్న ప్రపంచకప్‌ కోసం మరింత మెరుగ్గా తయారవ్వాలి. ఐపీఎల్‌కు, టీ20 ప్రపంచకప్‌కు కొంచెం వ్యవధి ఉండి ఉంటే టీమిండియా పరిస్థితి మరోలా ఉండేదేమో. అందుకే ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా బీసీసీఐ జాగ్రత్తగా వ్యవహరించాలి’ అని కపిల్‌ దేవ్‌ సూచించారు. 2012 తర్వాత ఓ ఐసీసీ టోర్నమెంట్‌లో కనీసం సెమీస్‌ కూడా చేరకుండా వెనుదిరగడం టీమ్‌ఇండియాకు ఇదే తొలిసారి. నామమాత్రమైన ఆఖరి మ్యాచ్‌లో భారత్‌ సోమవారం నమీబియాతో తలపడనుంది. గ్రూప్‌-2 నుంచి పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌ జట్లు ఇప్పటికే సెమీస్‌కు అర్హత సాధించాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img