దిల్లీ: భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య కోల్కతా వేదికగా నేటి (ఫిబ్రవరి 16) నుంచి ప్రారంభంకానున్న టీ20 సిరీస్కు ముందు భారత అభిమానులకు ఓ చేదు వార్త వినిపించింది. కరోనా కారణంగా.. నేడు జరగబోయే తొలి టీ20 మ్యాచ్కు ప్రేక్షకులను అనుమతించేది లేదని బీసీసీఐ స్పష్టం చేసింది. దేశంలో కరోనా ప్రభావం తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో కనీసం 50 శాతం ప్రేక్షకులనైనా అనుమతిస్తారని అభిమానులు భావించినా.. బీసీసీఐ అందుకు విముఖత వ్యక్తం చేసింది. దీంతో ఖాళీ స్టేడియంలోనే తొలి టీ20 మ్యాచ్కు సర్వం సిద్ధమైంది. కనీసం ఇదే వేదికగా జరగబోయే రెండు, మూడు మ్యాచ్లకైనా ప్రేక్షకులను అనుమతించాలని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్(క్యాబ్) కోరగా.. త్వరలోనే తుది నిర్ణయం వెల్లడిస్తామని బీసీసీఐ పేర్కొంది. ఐపీఎల్ ప్రారంభ తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎలాంటి రిస్క్లు అవసరం లేదని భావిస్తున్న బీసీసీఐ.. అవకాశం ఉన్నా ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్లు నిర్వహించేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.