సెంచరీతో దుమ్మురేపిన శర్మ
అర్ధసెంచరీ చేసిన పుజారా
ప్రస్తుతం ఆధిక్యం 100
ఓవల్: ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో టీమిండియా డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ(105 బ్యాటింగ్) సెంచరీ చేసి దుమ్మురేపాడు. స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తూ వీలు చిక్కిన బంతులను బౌండరీలకు తరలిస్తున్నాడు. చతేశ్వర్ పుజారా(53 బ్యాటింగ్)తో కలిసి బాధ్యతాయుతంగా ఆడుతూ భారత ఇన్నింగ్స్ను ముందుకు నడిపిస్తున్నాడు. దాంతో భారత్ 69 ఓవర్లలో వికెట్ నష్టానికి 199 పరుగులు చేసింది. ప్రస్తుతం టీమిండియా 100 పరుగుల ఆధిక్యంలో ఉంది. 43/0 ఓవర్నైట్ స్కోర్తో మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత్కు ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్(46) తొలి వికెట్కు 83 పరుగులు జోడిరచి మంచి శుభారంభాన్ని అందించారు. మరోసారి సెంచరీ భాగస్వామ్యం దిశగా దూసుకెళ్తున్న ఈ జోడీని జేమ్స్ అండర్సన్ విడదీశాడు. కీపర్ క్యాచ్గా కేఎల్ రాహుల్(46)ను పెవిలియన్ చేర్చాడు. అయితే ఈ ఔట్ విషయంలో అంపైర్ ఔటివ్వకపోయినా.. ఇంగ్లండ్ కెప్టెన్ రివ్యూకెళ్లి ఫలితం సాధించాడు. దాంతో రాహుల్ నాలుగు పరుగుల వ్యవధిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. అనంతరం పుజారా క్రీజులోకి రాగా.. రోహిత్ దూకుడుగా ఆడాడు. దాంతో భారత్ 108/1తో లంచ్ బ్రేక్కు వెళ్లింది. లంచ్ బ్రేక్ అనంతరం రోహిత్ శర్మ 145 బంతుల్లో 5 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దాంతో హిట్ మ్యాన్ కెరీర్లో మరో మైలురాయిని అందుకున్నాడు. ఓపెనర్గా అన్ని ఫార్మాట్లలో కలిపి 11 వేల పరుగులను నమోదు చేశాడు. ఈ రికార్డు అందుకున్న రెండో బ్యాట్స్మన్గా రోహిత్ నిలిచాడు. సచిన్ టెండూల్కర్ 241 ఇన్నింగ్స్ల్లో ఈ మైలురాయిని చేరుకోగా.. రోహిత్ శర్మ 246 ఇన్నింగ్స్ల్లో ఈ ఘనత సాధించాడు. వీరి తర్వాత మాథ్యూ హెడెన్ (251 ఇన్నింగ్స్), సునీల్ గవాస్కర్ (258 ఇన్నింగ్స్) ఉన్నారు.