Monday, May 20, 2024
Monday, May 20, 2024

మూడో స్థానంపై కొనసాగుతున్న సందిగ్ధత

న్యూదిల్లీ : ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ మూడో సీజన్లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో టీమిండియా 1`0 తేడాతో సిరీస్‌ సొంతం చేసుకున్నప్పటికీ జట్టును ఇంకా సమస్యలు వెంటాడుతున్నాయి. క్వీన్స్‌ పార్క్‌ ఓవల్‌లో జరిగిన రెండో టెస్టు అనూహ్యంగా డ్రాగా ముగిసింది. వర్షం కారణంగా రెండో టెస్టు రద్దయిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లోనూ భారత జట్టు విజయం సాధించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నప్పటికీ వరుణుడి ప్రతాపం వల్ల రద్దయింది. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఓమూడు సమస్యలు భారత్‌ ఎదుర్కో వడం గమనార్హం. అవేంటంటే… డబ్ల్యూటీసీ ఫైనల్‌ 2023లో సీనియర్‌ ఆటగాడు ఛతేశ్వర్‌ పుజారా పేలవ ప్రదర్శనతో విఫలమయ్యా డు. అంతకు ముందు కౌంటీల్లో వరుసగా సెంచరీలు బాదడం వల్ల అతడిపై భారీ అంచనాలు ఉండేవి. కానీ కీలకమైన పోరులో పుజారా చేతులెత్తేయడం వల్ల అతన్ని పక్కన పెట్టేశారు. అంతే కాకుండా విండీస్‌తో సిరీస్‌కు అతడిని ఎంపిక చేయలేదు. దీంతో ఇషాన్‌ కిషన్‌, యశస్వి జైస్వాల్‌కు అవకాశం దక్కింది. ఇక ఓపెనర్‌గా దిగిన యశస్వి… తొలి టెస్టులోనే భారీ శతకంతో ఎంట్రీ అదరగొట్టాడు. ఇక ఇషాన్‌ కిషన్‌ కూడా రెండో టెస్టులో ముందుకొచ్చి మరీ వేగవంతమైన అర్ధ సెంచరీ సాధించాడు. అయితే, ఏ జట్టుకైనా వన్‌డౌన్‌ చాలా కీలకం. ఇలాంటి స్థానంలో ఎవరు ఆడతారు? అనే ప్రశ్న అందరిలోనూ తలెత్తింది. అయితే సీనియర్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లీ నాలుగో స్థానంలో వస్తాడు. అందుకే శుభ్‌మన్‌ గిల్‌ స్వయంగా ముందుకొచ్చి… తాను ఆడాలని భావిస్తున్నట్లు మేనేజ్‌మెంట్‌ దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో అందరూ ఈ నిర్ణయాన్ని అద్భుతమని కొనియాడారు. ఎందుకంటే ఆ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే ఆటగాడు క్రీజ్‌లో పాతుకుపోయి ఇన్నింగ్స్‌ ఆడాల్సి ఉంటుంది. అయితే, ఓపెనర్లు అదరగొట్టిన రెండు టెస్టుల్లోనూ గిల్‌ మాత్రం కాస్త నిరాశపరిచాడు. ఇక్కడ ఉండే ఒత్తిడిని అతను తట్టుకోవడంలో విఫలమయ్యా డని క్రికెట్‌ విశ్లేషకులు అంచనా వేశారు. తొలి టెస్టులో 6 పరుగులు మాత్రమే చేసిన గిల్‌.. రెండో టెస్టులో 10, 29 పరుగులు సాధించాడు. అయితే రెండో టెస్టు రెండవ ఇన్నింగ్స్‌లో కాస్త దూకుడు ప్రదర్శిం చాడు. కానీ ఇలాంటి కీలక స్థానంలో ఉత్తమ ప్రదర్శన చేయాలంటే మరింత అనుభవం అవసరం ఉంటుంది. దీంతో మరికొన్ని మ్యాచ్‌లో గిల్‌కు అవకాశం ఇవ్వాలనే సూచనలు కూడా వచ్చాయి.
రహానేకి ఏమైంది?
విండీస్‌ పర్యటనకు ముందు అజింక్య రహానె పరిస్థితి ఒకలా ఉండేది. ఐపీఎల్లో సూపర్‌ ప్రదర్శన… డబ్ల్యూటీసీ ఫైనల్లో నిలకడైన ఆట తీరుతో టీమిండియాకు వైస్‌ కెప్టెన్‌ బాధ్యత చేపట్టాడు. కానీ ఇతర బ్యాటర్లు అలవోకగా పరుగులు సాధించిన పిచ్‌లపై రహానే తేలిపోవడం విస్మయానికి గురి చేస్తోంది. రెండు టెస్టుల్లో రెండు ఇన్నింగ్స్‌లో మాత్రమే బ్యాటింగ్‌ చేసే అవకాశం వచ్చింది. అయితే, మొత్తం 11 పరుగులు (3, 8) అతను చేయడం గమనార్హం. అయితే డిసెంబర్‌ వరకు టెస్టు మ్యాచ్‌లు లేవు. మళ్లీ దక్షిణాఫ్రికాతోనే సిరీస్‌ ఆడాల్సి ఉంటుంది. ఆలోగా దేశవాళీ క్రికెట్లో అజింక్య రాణిస్తేనే జట్టులో చోటు దక్కుతుంది. ఇక చాలా రోజుల తర్వా త టెస్టు జట్టులోకి వచ్చిన జయదేవ్‌ ఉనద్కత్‌ ప్రదర్శన మరీ తేలిపోయేలా ఉంది. రెండు టెస్టుల సిరీస్‌లో భారత బౌలర్లు 230 ఓవర్లు వేశారు. అందులో జయదేవ్‌్‌ వేసిన ఓవర్లు కేవలం 28 మాత్రమే అంటే మీరు నమ్ముతారా? ఈ సిరీస్‌లో ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు. రెండో టెస్టుతో సుదీర్ఘ ఫార్మాట్లోకి అడుగు పెట్టిన ముకేశ్‌ కుమార్‌ కూడా రెండు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. మరీ ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్‌లో ఐదు ఓవర్లు వేసిన ముకేశ్‌ నాలుగు మెయిడిన్లు చేయడం విశేషం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img