టోక్యో: జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ ప్రపంచ టూర్ సూపర్ 750 టోర్నీలో భారత షట్లర్ లక్ష్యసేన్ సెమీస్కు దూసుకెళ్లాడు. క్వార్టర్స్లో కొకి వతనబె (జపాన్)పై 21-15, 21-19 వరుస సెట్లలో విజయం సాధించాడు. గతేడాది జరిగిన కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్గా నిలిచిన లక్ష్యసేన్… ఇటీవలే కెనడా ఓపెన్ సూపర్ 500 టోర్నీ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా జపాన్ ఓపెన్లో ఎదురులేకుండా ముందుకు సాగుతున్నాడు. ఇక సెమీఫైనల్స్లో ఇండోనేశియా ఆటగాడు జొనాథన్ క్రిష్టీతో లక్ష్యసేన్ ఆడాల్సి ఉంటుంది.
నిరాశపర్చిన ప్రణయ్
మరో భారత షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్కు నిరాశ తప్పలేదు. టాప్ సీడ్ విక్టర్ అక్సెల్సెన్ (డెన్మార్క్) చేతిలో 19-21, 21-18, 21-8 తేడాతో ఓడిపోయాడు. తొలి సెట్లో ఆధిపత్యం ప్రదర్శించిన ప్రణయ్… రెండో సెట్ ఆరంభంలోనూ దూకుడుగా ఆడాడు. అయితే, పుంజుకున్న అక్సెల్సెన్ ప్రణయ్కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడుతూ విజయం సాధించాడు.
డబుల్స్ జోడీకి పరాజయం
ఇదే టోర్నీలో భారత డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి – చిరాగ్ శెట్టి ఓటమి చవి చూశారు. చైనీస్ తైపీకి చెందిన లీ యాంగ్- వాంగ్ లిన్ చేతిలో 15-21, 25-23, 16-21 తేడాతో భారత ఆటగాళ్లు సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి – చిరాగ్ శెట్టి ఓడిపోయారు. తొలి సెట్ను కోల్పోయిన తర్వాత పుంజుకున్న భారత జోడీ రెండో సెట్ను కష్టపడి సొంతం చేసుకుంది. ఇక కీలకమైన మూడో సెట్లో రెండు దేశాల షట్లర్లు తీవ్రంగా పోరాడారు. అయితే, చివరికి చైనీస్ తైపీ జోడీనే సెట్ను కైవసం చేసుకుని సెమీఫైనల్స్లోకి ప్రవేశించింది.