విశాలాంధ్ర -అనంతపురం : జిల్లావ్యాప్తంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో విస్తృతంగా మొక్కల పెంపకం చేపట్టడం జరుగుతోంది. పర్యావరణం మరియు అటవీ మంత్రిత్వ శాఖ మార్గదర్శకత్వంలో “ఏక్ పెద్ మా కే నామ్” కార్యక్రమం కింద జిల్లా వ్యాప్తంగా 100 కి పైగా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి మరియు గత 5 రోజుల్లో 3,592 మొక్కలను అటవీ శాఖ ఆధ్వర్యంలో ప్రజలతో కలిసి నాటడం జరిగింది. జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ “ఏక్ పెద్ మా కే నామ్” కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా స్థాయిలో నోడల్ అధికారిగా జిల్లా అటవీ అధికారి వినీత్ కుమార్ ఐఎఫ్ఎస్ వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా అటవీ అధికారి మాట్లాడుతూ అటవీశాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా మొక్కల పెంపకం చేపట్టడం జరుగుతోందని పేర్కొన్నారు. అనంతపురంలో అటవీశాఖ అటవీ నర్సరీల నుంచి మొక్కలు సరఫరా చేస్తోందని, అనంతపురం నగరవాసులందరూ ముందుకు వచ్చి మొక్కను నాటి సంరక్షించాలని విజ్ఞప్తి చేశారు. తల్లికి సన్మానం చేసి ప్లాంట్ ఫర్ మదర్ ప్రచారాన్ని విజయవంతం చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ తల్లి పేరు మీద ఒక చెట్టు నాటాలని, మొక్కను చెట్టు అయ్యేదాకా సంరక్షించాలని విజ్ఞప్తి చేశారు.