- కార్పొరేషన్ కమిషనర్ చల్లా ఓబులేషు
- ఘనంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహావిష్కరణ
విశాలాంధ్ర – శ్రీకాకుళం : భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య యువ ఇంజనీర్లకు మార్గదర్శకులని శ్రీకాకుళం నగర కార్పొరేషన్ కమిషనర్ చల్లా ఓబులేష్ అన్నారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య 161వ జయంతిని పురస్కరించుకుని నగరంలోని శాంతి నగర్ కాలనీలో ఉన్న గాంధీ మందిరంలో గురువారం మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోక్షగుండం ఇంజనీరే కాకుండా గొప్ప పండితుడు, రాజనీతిజ్ఞుడు అని కొనియాడారు. ఆయన నిర్మించిన ఆనకట్టలు, వంతెనలు ఇప్పటికీ ధృడంగా ఉన్నాయని తెలిపారు. ఆయన కృషికి గుర్తింపుగానూ ఎన్నో బిరుదులు, మరెన్నో పురస్కారాలు లభించాయని వివరించారు.
ఎంతోమంది ఇంజినీరులకు మార్గదర్శనం చేసిన మహోన్నత వ్యక్తి విశ్వేశ్వరయ్య అని చెప్పారు. ఆధునిక భారతదేశంలో ఆనకట్టలు, రిజర్వాయర్లు, హైడ్రో-ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ల నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన గొప్ప ఇంజినీర్ విశ్వేశ్వరయ్య అని కొనియాడారు. అందుకే విశ్వేశ్వరయ్య పుట్టిన రోజును ప్రతి ఏటా “ఇంజినీర్స్ డే” గా జరుపుకుంటున్నామని వివరించారు. శ్రీకాకుళం జిల్లా లైసెన్స్ డ్ టెక్నికల్ పర్సన్స్ అండ్ కన్సల్టింగ్ ఇంజినీర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు హారిక ప్రసాద్ మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలు నెలకొల్పిన స్మృతి వనం లో ఓ ఇంజనీర్ కు అవకాశం కల్పించడం గొప్ప విషయమన్నారు. కమిషనర్ చల్లా ఓబులేష్ నగర పరిధిలోని ఇంజనీర్లకు ఇబ్బంది లేకుండా సహకారం అందిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి ఇంజనీర్లకు సూచనలు సలహాలు అందిస్తున్నారన్నారు. నగర సుందరీకరణలో కమిషనర్ పాత్ర గొప్పదన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ చైర్మన్ నటుకుల మోహన్, నిక్కు అప్పన్న, పొన్నాడ రవికుమార్, జామి భీమశంకర్, ఇంజనీర్లు వాండ్రంగి శ్రీనివాసరావు, వెంకు మహంతి శ్రీనివాసరావు, ఆచంట రాము, డి ఎస్ ఎల్ ఎన్ మూర్తి, జి శ్రీనివాసరావు, డి కామేశ్వరరావు, బి సురేష్ తదితరులు పాల్గొన్నారు.