హైదరాబాద్లో ట్రాఫిక్ కష్టాలు తప్పించేందుకు మరో ఫ్లై ఓవర్ అందుబాటులోకి వచ్చింది. నాగోల్ లో దాదాపు రూ.143.58 కోట్ల వ్యయంతో చేపట్టిన ఫ్లై ఓవర్ ను ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం ప్రారంభించారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీని నివారించడానికి తెలంగాణ ప్రభుత్వం, జీహెచ్ ఎంసీ సంయుక్తంగా చేపట్టిన వ్యూహాత్మక రహదారి అభివృద్ధి పథకం (ఎస్ ఆర్ డీపీ)లో భాగంగా నిర్మించిన ఆరు లైన్ల ఈ ఫ్లైఓవర్ 990 మీటర్ల పొడవు ఉంది. నాగోల్-సికింద్రాబాద్ మార్గంలో ఉన్న ఈ ఫ్లై ఓవర్ను 143.58 కోట్ల వ్యయంతో నిర్మించారు.ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ మహానగరం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదన్నారు.ఈ ఫ్లైఓవర్ నిర్మాణంతో ఉప్పల్ నుంచి ఎల్బీ నగర్ వరకు ప్రజలు ట్రాఫిక్ కష్టాలు లేకుండా ప్రయాణం చేయవచ్చన్నారు. వచ్చే ఏడాది మార్చి నెలలోపల మరో నాలుగు ప్రాజెక్టులు పూర్తవుతాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. నగరంలో సరైన మౌలిక వసతులు కల్పించకపోతే బెంగళూరు మాదిరిగా ఇక్కడి ప్రజలు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ట్రాఫిక్ రద్దీ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకునే ఎస్ఆర్ డీపీ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు.