ఉక్రెయిన్లో చిక్కుకున్న తెలుగు విద్యార్థుల కోసం తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కంట్రోల్ రూంలు ఏర్పాటుచేశాయి. తెలంగాణ విద్యార్థులకు సహాయం అందించేందుకు దిల్లీలోని తెలంగాణ భవన్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ తెలిపారు. ఉదయం నుంచి ఉక్రెయిన్లో ఉన్న విద్యార్థుల నుంచి కాల్స్, మెయిల్స్ వస్తున్నాయన్నారు. విదేశాంగ శాఖ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు. ఉక్రెయిన్ గగనతలం తెరుచుకున్నాక అన్ని విధాలుగా విద్యార్థులకు సహాయం చేస్తామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అడ్వైజరీలను విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు తెలుపుతున్నట్లు చెప్పారు. విద్యార్థుల నుంచి పూర్తి వివరాలు తీసుకున్నారని, ఎవరూ ఆందోళన చెందాల్సి అవసరం లేదని గౌరవ్ ఉప్పల్ తెలిపారు.