చీకోటి వాట్సాప్ – ల్యాప్టాప్ నుంచి కీలక సమాచారం
సినీ, రాజకీయ ప్రముఖులకు నోటీసులు ఇవ్వనున్న ఈడీ
ఫార్మ్ హౌస్లో అటవీశాఖ అధికారుల తనిఖీలు
విశాలాంధ్ర – హైదరాబాద్ :
క్యాసినో కేసులో ఈడీ అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్కు ఉన్న సంబంధాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఆయన ఇళ్లలో దాడులు నిర్వహించిన ఈడీ అధికారులు కాల్ డేటాతో పాటు వాట్సాప్ చాటింగ్ ల పై దృష్టి సారించారు. ఈడీ అధికారులు ఈ కేసులో శుక్రవారం మరింత సమాచారం సేకరించగా చీకోటి ఫామ్ హౌస్ లో అటవీ శాఖాధికారులు తనిఖీలు చేపట్టారు. ఆయన వాట్సాప్ నుంచి కీలక సమాచారం సేకరించినట్లు సమాచారం. అలాగే ఫోన్, ల్యాప్టాప్ను సీజ్ చేశారు. చీకోటికి చెందిన 4 బ్యాంకు అకౌంట్లలో పెద్దమొత్తంలో హవాలా జరిగినట్లు ఈడీ అధికారులు గుర్తించారు.ఆయనతో సంబంధం ఉన్న 10 మంది సినీ ప్రముఖులతోపాటు 20 మంది ప్రజాప్రతినిధులకు నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. వాట్సాప్లో ప్రముఖులతో చాటింగ్ చేసినట్లు గుర్తించారు.
అదేవిధంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యాపార, రాజకీయవేత్తలతో పరిచయాలు ఉండడంతో పాటు బిగ్డాడీ అడ్డా ప్రమోషన్ కోసం తారలకు ఎర వేసినట్లు అధికారులు గుర్తించారు. తారలతో తయారు చేసిన ప్రోమోలను వాట్సాప్లో ప్రముఖులకు పంపిన చీకోటి, నగదు లావాదేవీలకు సంబంధించి కీలక డేటా ఉన్నట్లు గుర్తించారు. అదే సమయంలో ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ హేమ అధ్వర్యంలో కడ్తాల్ సమీపంలోని సాయిరెడ్డిగూడెంలోని చీకోటి ఫార్మ్ హౌస్ లో అటవీ శాఖ అధికారుల తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా వున్న జంతువులను గుర్తించి, అనుమతులు తనిఖీ చేస్తామని, ఫార్మ్ హౌజ్ నిర్వాహకులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు.