ప్రతిపక్షాల సభలకు ఆగమేఘాల మీద అనుమతులు లేవని నిరాకరించే పోలీసులు టీఆర్ఎస్ సభలకు ఎలా ఇస్తున్నారంటూ మాజీ ఐపీఎస్, బీఎస్పీ కన్వీనర్ ఆర్ఎస్ ప్రవీణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.కోవిడ్ నిబంధనల పేరుతో అనుమతులు ఇవ్వకుండా కేసీఆర్ సర్కార్ ప్రతిపక్షాల గొంతు నొక్కుతోందని అన్నారు. అందుకు ప్రత్యక్ష సాక్ష్యంగా నల్గొండ జిల్లా నకిరేకల్లో జరిగిన టీఆర్ఎస్ ర్యాలీ ఫొటోలను షేర్ చేశారు.మొన్న నకిరేకల్లో జరిగిన టీఆర్ఎస్ సంబరాలకు కోవిడ్ నిబంధనలు వర్తించవని.. అవి కేవలం ప్రతిపక్ష పార్టీలకు మాత్రమే వర్తిస్తాయని ఆర్ఎస్ ప్రవీణ్ విమర్శించారు. ఒమిక్రాన్ పేరుతో అందరి గొంతు నొక్కి, అరెస్టులు చేస్తూ ఇక్క కేసీఆర్ ప్రభుత్వం మాత్రం సంబరాలు చేసుకుంటోందని అన్నారు.మా సభలకు ఆగమేఘాల మీద అనుమతి నిరాకరించిన పోలీసులు.. టీఆర్ఎస్ వాళ్లకెలా అనుమతులు ఇస్తున్నారని ఆయన ప్రశ్నలు సంధించారు. అలాగే రాష్ట్రంలో వివాదాస్పదంగా మారిన జీవో నంబర్ 317పై కూడా ప్రవీణ్ ఘాటుగా స్పందించారు. ప్రజల ధన, మాన ప్రాణాలను కాపాడడానికే ప్రజాస్వామిక ప్రభుత్వాలు జీవోలు తీసుకొస్తాయని చదువుకున్నామని.. కానీ తెలంగాణలో మాత్రం రహస్యంగా జీవోలు వస్తున్నాయని విమర్శించారు. పాలకుల అక్రమ ఆస్తుల సంపాదనకు, పేదల పొట్టగొట్టేందుకు.. ఉద్యోగుల ప్రాణాలు తీసేందుకే జీవోలు వస్తున్నట్లు ఉందని ఆన్నారు.