సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వ పరిపాలన కొనసాగుతోందని, ఈ 8 ఏండ్లలో తెలంగాణ పల్లెల స్వరూపం మారిపోయిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ వాహనాలు పంపిణీ చేసి, మత్స్యకార భవన్ నిర్మాణ స్థలం, ఎస్సీ, బీసీ డిగ్రీ కళాశాల, వ్యవసాయ కళాశాల భవనాల స్థలాలు మంత్రి నిరంజన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో గ్రామీణ వృత్తి కార్మికులు బలపడ్డారని తెలిపారు. ఉచిత చేప పిల్లల పంపిణీతో మత్స్యకార కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకున్నాయని పేర్కొన్నారు. సబ్సిడీ గొర్రెపిల్లలతో గొల్ల కుర్మలు బలపడ్డారని చెప్పారు. కళ్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ , ఆసరా పథకాలతో మధ్యతరగతి, బలహీనవర్గాలకు భరోసా లభించిందన్నారు. రైతుబంధు, రైతుభీమా, సాగునీరు, వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ పథకాలు వ్యవసాయానికి ఊతమిచ్చాయన్నారు. ఒక్కొక్క రంగాన్ని ప్రణాళికాబద్ధంగా తెలంగాణలో అభివృద్ధి చేస్తున్నామని మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు.