విదేశాల్లో మాదిరిగా ఇప్పుడు మన దేశంలోనూ మల్టీప్లెక్స్ కల్చర్ ఎక్కువవుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో సింగిల్ స్క్రీన్ థియేటర్లకు కాలం చెల్లుతోంది. ఈ క్రమంలో దేశంలోనే అతి పెద్ద తెర సిద్ధమవుతోంది. హైదరాబాద్లో ఐమ్యాక్స్లో ఇప్పటికే బిగ్ స్క్రీన్ ఉంది. సిటీలోనే పెద్ద స్క్రీన్ గా దానికి పేరుంది. మరికొన్ని రోజుల్లో ఐమాక్స్ లో దేశంలోనే అతి పెద్ద తెరపై సినిమా చూసే అవకాశం ప్రేక్షకులకు లభించనుంది. ఐమాక్స్ లో అతి పెద్ద తెరను యాజమాన్యం సిద్ధం చేసింది. ఈ స్క్రీన్ 64 అడుగుల ఎత్తు, 101.6 అడుగుల వెడల్పుతో ఉంది. దాంతో, ఇది భారత దేశంలో అతి పెద్ద సినిమా తెరగా రికార్డుకెక్కింది. కెనడాకు చెందిన ‘స్ట్రాంగ్ ఎండీఐ’ అనే ప్రొజెక్షన్ స్క్రీన్ల తయారీ సంస్థ ప్రత్యేకంగా ఈ తెరను రూపొందించింది. సౌండ్ సిస్టమ్ ను కూడా అత్యుత్తమమైనది ఏర్పాటు చేశారు. డిసెంబర్ 16న అవతార్ 2 విడుదల నాటికి ఈ తెర ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.