Friday, April 26, 2024
Friday, April 26, 2024

మనుషుల్ని వేటాడుతున్న పులి.. రంగంలోకి హైదరాబాద్‌ షూటర్‌

మనిషి రక్తం రుచి మరిగిన ఓ రాయల్‌ బెంగాల్‌ టైగర్‌ ప్రజలను వణికిస్తోంది. ఎప్పుడు, ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తుందో తెలియక ప్రజలు ప్రాణాలు అరచేత పెట్టుకుని బతుకుతున్నారు. దానిని బంధించేందుకు అటవీ శాఖ అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చివరికి హైదరాబాద్‌ షార్ప్‌ షూటర్‌ నవాబ్‌ షఫత్‌ అలీఖాన్‌ రంగంలోకి దిగారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బీహార్‌లోని పశ్చిమ చంపారన్‌ జిల్లాలోని బగహాలో ఉన్న ‘వాల్మీకి టైగర్‌ రిజర్వ్‌’ (వీటీఆర్‌)లోని ఓ పులి పరిసర గ్రామాల ప్రజలను నిద్రకు దూరం చేస్తోంది. మనిషి రక్తం రుచి మరిగిన ఈ పులి నెల రోజుల్లో ఐదుగురి ప్రాణాలు తీసింది. దీంతో వీటీఆర్‌ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయపడిపోతున్నారు. ఈ పులిని పట్టుకుని బంధించేందుకు అటవీశాఖ రెస్క్యూ సిబ్బంది చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. స్థానిక బైరియా కాలా గ్రామం కేంద్రంగా నిపుణుల సాయంతో దాని ఆచూకీని కనుగొనేందుకు అటవీ అధికారులు నానా కష్టాలు పడుతున్నారు. అయినప్పటికీ అది చిక్కడం లేదు సరికదా తాజాగా, అది తన స్థావరాన్ని మార్చుకుని హరిహర్‌పూర్‌ గ్రామంలోని చెరకు తోటల్లోకి చేరుకుంది. దీంతో గ్రామస్థుల భయం మరింత ఎక్కువైంది. 150 మంది అధికారులు, సిబ్బంది ఇప్పుడు దానిని పట్టుకునే పనిలోనే నిమగ్నమైనా అది వారి కంటపడకుండా తప్పించుకు తిరుగుతోంది. దీంతో ఇక లాభం లేదని భావించిన అధికారులు హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ షూటర్‌ నవాబ్‌ షఫత్‌ అలీఖాన్‌కు కబురందించారు. వెంటనే ఆయన రంగంలోకి దిగిపోయారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img