. కేంద్రం ఒత్తిడికి తలొగ్గలేదు
. కాంగ్రెస్ది అవగాహనా రాహిత్యం
. తెలంగాణ హక్కుల కోసం ఎందాకైనా పోరాటం
. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్
విశాలాంధ్ర-హైదరాబాద్ : బీఆర్ఎస్ను ఎవరూ ఏమీ చేయలేరని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఇపుడు కాంగ్రెస్ లో ఉన్న వారికంటే హేమాహేమీలను తట్టుకుని నిలబడిన పార్టీ బీఆర్ఎస్ అని తెలిపారు.ఎన్నికల తరువాత మొదటి సారిగా మంగళవారం తెలంగాణ భవన్ కు వచ్చిన కేసీఆర్… మహబూబ్నగర్, రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ జిల్లాల పార్టీ ప్రతినిధులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీన నల్గొండలో నిర్వహించ తలపెట్టిన భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వ ప్రమాదకర మూర్ఖపు వైఖరిని తిప్పికొట్టి కృష్ణా జలాలు, ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ హక్కులను నూటికి నూరుశాతం కాపాడేందుకు ఎంతవరకైనా పోరాడాల్సిందేనని కేసీఆర్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో సాగునీరు, తాగునీటి హక్కుల కోసం పోరాడడమే కాకుండా ‘మా నీళ్లు మాకే’ అనే ప్రజా నినాదాన్ని స్వయంపాలన ప్రారంభమైన అనతికాలంలోనే నిజం చేసి చూపించిన ఘనత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. కేఆర్ఎంబీ పేరుతో కృష్ణా నదీ ప్రాజెక్టులపై తెలంగాణకున్న హక్కులను కైవసం చేసుకునేందుకు కేంద్రం వేసే ఎత్తుగడలను ఎప్పటి కప్పుడు తిప్పికొడుతూ కేంద్రం ఒత్తిళ్లను తట్టు కుంటూ పదేళ్లపాటు బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేసి కాపాడిరదన్నారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వ అవగాహన రాహిత్యంతో సంతకాలు చేసి తీసుకున్న నిర్ణయంతో భవిష్యత్తులో ప్రాజెక్టుల కట్టల మీదకి కూడా పోలేని పరిస్థితి దాపురించిం దని ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని ప్రజా మద్దతుతో తిప్పికొడదామన్నారు. హైదరాబాద్ రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం, మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాల ప్రజలకు సాగునీరు తాగునీరు అందక తిరిగి కరువుకోరల్లో చిక్కుకునే ప్రమాదం పొంచివున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో కేంద్రం ఎంత ఒత్తిడి తెచ్చినా 10 ఏళ్లలో ఏనాడూ తెలంగాణ ప్రాజెక్టులు అప్పగించలేదని కేసీఆర్ స్పష్టం చేశారు. చివరకు ప్రాజెక్ట్లు మాకు అప్పగించాలని లేదంటే తామే నోటిఫై చేస్తామని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తనను బెదిరించారన్నారు. ప్రాజెక్టులు అప్పగించే ప్రసక్తే లేదని ఆనాడే చెప్పినట్లు తెలిపారు. వ్యక్తిగతంగా తనను, బీఆర్ఎస్ను కొత్త సీఎం ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారన్నారు. తెలంగాణ కోసం కేసీఆర్ ఏనాడూ వెనక్కు పోడని, ఉడుత బెదిరింపులకు భయపడనని తెలిపారు. తెలంగాణ ప్రయోజనాల కోసం ఏం చేయాలో తనకు బాగా తెలుసని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్ రావు, జీ జగదీశ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, పువ్వాడ, సత్యవతి రాథోడ్తో పాటు ఎమ్మెల్యేలు ఎంఎల్సీలు, ఎంపీలు, జడ్పీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు.