మంత్రి కేటీఆర్
తెలంగాణ ప్రభుత్వ పరిపాలన గొప్పగా సాగుతుందని, అపూర్వమైన విధానాలతో, పాలసీలతో దేశంతో పాటు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచామని మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ నెల 25న హైటెక్స్లో జరగనున్న టీఆర్ఎస్ పార్టీ జనరల్ బాడీ సమావేశం ఏర్పాట్లను కేటీఆర్ గురువారం మధ్యాహ్నం పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రైతుబంధు, మిషన్ భగీరథ పథకాన్ని స్ఫూర్తిగా తీసుకొని పీఎం కిసాన్, జల్ జీవన్ మిషన్ను కేంద్రం ప్రారంభించిందని తెలిపారు. టీఎస్ ఐపాస్ వంటి అనుమతుల విధానాన్ని కూడా కేంద్రం త్వరలో తీసుకురాబోతున్నదని చెప్పారు. 25న జరిగే పార్టీ జనరల్ బాడీ మీటింగ్లో పార్టీ అధ్యక్షుడి ఎన్నిక ఉంటుంది. ఈ కార్యక్రమానికి వచ్చే పార్టీ ప్రతినిధులతో పాటు.. మొత్తం సమావేశం సజావుగా సాగేలా అనేక ఏర్పాట్లను చేస్తున్నామని తెలిపారు.