సంక్రాంతికి తమ సొంతూరుకు వెళ్లేవారికి టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ తెలిపింది. బస్సుల్లో సీట్ల కోసం అడ్వాన్స్ బుకింగ్స్ను తాజాగా ప్రారంభించింది. సంక్రాంతి సందర్భంగా బస్సుల్లో ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయకూడదని టీఎస్ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. గతంలో 30 రోజుల ముందుగానే అడ్వాన్స్ బుకింగ్ చేసుకునే సౌకర్యం టీఎస్ఆర్టీసీ బసులకు అందుబాటులో ఉండేది. కానీ 60 రోజుల ముందుగానే అడ్వాన్స్ బుకింగ్ చేసుకునే అవకాశాన్ని టీఎస్ఆర్టీసీ ఇప్పుడు అందుబాటులోకి తెచ్చింది.సంక్రాంతి సందర్భంగా తెలంగాణతో పాటు ఏపీలోని వివిధ ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు టీఎస్ఆర్టీసీ నడపనుంది. సంక్రాంతికి హైదరాబాద్ నుంచి చాలామంది తమ సొంతూళ్లకు వెళతారు. దీని వల్ల ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీంతో ప్రతి ఏడాది సంక్రాంతి సందర్భంగా టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. పండుగుల సమయాల్లో తిప్పే ప్రత్యేక బస్సుల్లో గతంలో అదనపు ఛార్జీలు వసూలు చేసేవారు. సజ్జనార్ టీఎస్ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి పండుగల సమయంలో నడిపే ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీలు వసూలు చేయకూడదని నిర్ణయించారు.ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయకపోవడంతో పండుగల సమయంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య మరింత పెరుగుతూ వస్తోంది. దీని వల్ల టీఎస్ఆర్టీసీకి కూడా మరింత ఆదాయం వస్తోంది. గత ఏడాది సంక్రాంతి సమయంలో ఆర్టీసీ బస్సుల్లో ఎలాంటి అదనపు ఛార్జీలను వసూలు చేయలేదు. దీని వల్ల ప్రయాణికులకు ఊరట కలిగింది. ఈ సారి కూడా అదే నిర్ణయాన్ని టీఎస్ఆర్టీసీ అధికారులు అమలు చేస్తోందన్నారు.