సికింద్రాబాద్ రూబీ లాడ్జిలో జరిగిన అగ్ని ప్రమాదం కేసులో పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. రూబీ లాడ్జి, ఎలక్ట్రిక్ స్కూటర్ల షోరూంల నిర్వాహకులైన రాజేందర్ సింగ్, ఆయన కుమారుడు సునీత్ సింగ్, మేనేజర్ సుదర్శన్ నాయుడు, సూపర్వైజర్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం రాత్రి ప్రమాదం తర్వాత పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. అయితే అగ్నిప్రమాదం జరిగిన తరువాత నుంచి పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు నలుగురి అరెస్టు చేశారు. రూబీ లాడ్జి ఐదు అంతస్తుల భవనంలో రన్ చేస్తుండగా…. మొదటి అంతస్తులో ఫైనాన్స్ సంస్థ, రిసెప్షన్ విభాగాలున్నాయి. అయితే వెహికిల్ పార్కింగ్కు కేటాయించిన సెల్లార్లో ఎలక్ట్రిక్ వాహనాల షోరూం నిర్వహిస్తున్నారు. ఇందులో షార్ట్ సర్క్యూట్ కావడంతో సోమవారం రాత్రి 9 గంటల తరువాత సెల్లార్లో అగ్నిప్రమాదం సంభవించింది. కొన్ని క్షణాల్లో మంటలు బిల్డింగ్ మొత్తం వ్యాపించాయి. ఎలక్ట్రిక్ వాహనాలన్నీ కాలి బూడిదయ్యాయి. వాహనాల టైర్లు కాలటంతో భవనంలోని పై అంతస్తులో సైతం దట్టమైన పొగ వ్యాపించింది. పొగ ధాటికి తట్టుకోలేక ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా, పోలీసులు, స్థానికులు కొందర్ని ఆసుపత్రికి తరలించారు. ఐదుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.