ఇటీవల విడుదలైన సివిల్స్ ఫలితాల్లో ర్యాంకులు సాధించిన పలువురికి రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు బుధవారం హైదరాబాద్లోని తన నివాసంలో అల్పాహార విందు ఇచ్చారు. సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ మల్లవరపు బాలలతతో పాటు సివిల్స్ ర్యాంకర్లు హరీశ్ ను కలిశారు. ఈ సందర్భంగా సివిల్స్ విజేతలను ఆయన సన్మానించారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ, సివిల్స్ లో ర్యాంకులు సాధించి తెలుగు వారందరికీ గర్వకారణంగా నిలిచారని ప్రశంసించారు. స్వయంగా ఐఏఎస్ అధికారిణి అయిన బాలలత హైదరాబాదులో ఐఏఎస్ అకాడమీని ఏర్పాటు చేయడం గొప్ప విషయమని చెప్పారు. ఇప్పటి వరకు ఆమె వంద మందికి పైగా సివిల్స్ విజేతలను తీర్చిదిద్దడం మనందరికీ గర్వకారణమని అన్నారు.