వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లనూ గెలుచుకోవాలని జగన్ నిన్న చేసిన వ్యాఖ్యలకు అచ్చెన్న కౌంటర్ ఇచ్చారు. 175 సీట్లనూ గెలుస్తామనే నమ్మకం జగన్కు ఉంటే ఇప్పుడే అసెంబ్లీని రద్దుచేసి ఎన్నికలకు వెళ్లాలని సవాల్ చేశారు. ఎన్నికల్లో మొత్తం సీట్లనూ వైఎస్ఆర్సీపీ గెలిస్తే టీడీపీ కార్యాలయానికి తాళం వేసేస్తామని అన్నారు.మరి 175 స్థానాల్లో వైసీపీ గెలుస్తుందని జగన్కు నమ్మకం ఉందా? అని అచ్చెన్న ప్రశ్నించారు. అదే నమ్మకం ఉన్నట్లైతే జగన్ ఇప్పుడే ఎన్నికలకు వెళ్లాలని ఆయన సవాల్ విసిరారు. తక్షణమే గవర్నర్ను కలిసి ప్రభుత్వాన్ని రద్దు చేస్తున్నట్లు జగన్ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. అయినా ఏం చేశారని రాష్ట్ర ప్రజలు వైసీపీని 175 స్థానాల్లో గెలిపిస్తారని అచ్చెన్న ప్రశ్నించారు. మరోమారు జగన్కు ఓట్లేసేంత అమాయకులు ప్రజలు కాదని ఆయన వ్యాఖ్యానించారు. టెన్త్ రిజల్ట్స్ నేపథ్యంలో ప్రభుత్వ తప్పుల కారణంగా మనోవేదనకు గురవుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో భరోసా నింపేందుకు నారా లోకేశ్ జూమ్ మీటింగ్ నిర్వహిస్తే వైసీపీ నేతలు అందులోకి దొంగల్లా ప్రవేశించారని అచ్చెన్న మండిపడ్డారు. పిల్లలను భయపెట్టి జూమ్ కాన్ఫరెన్స్లోకి చొరబడ్డ వైసీపీ నేతలపై పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.