కాంగ్రెస్ నేత మల్లు రవి
విశాలాంధ్ర ` హైదరాబాద్ : ఈనెల 9వ తేదిన ఇంద్రవెళ్ళిలో దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా కార్యక్రమం టీపీసీసీ అధ్యక్షులు రేవంత్రెడ్డి ప్రకటించిన విధంగా ప్రారంభవుతుందని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లురవి తెలిపారు. ఈ కార్యక్రమం వచ్చే సెప్టెంబర్ 17వ వరకు కొనసాగుతుందని రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజవర్గాలలో సభలు నిర్వహిస్తామన్నారు. సోమవారం గాంధీభవన్లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో అయన మాట్లాడుతూ ఇంద్రవెళ్ళి గిరిజన ఆత్మగౌరవానికి ప్రతీక అని అందుకే అక్కడి నుండే ఈ పోరాటానికి శ్రీకారం చుట్టడం జరుగుతుందన్నారు. రాజ్యాంగ రచన కమిటీ సభల్లో 90శాతం కాంగ్రెస్ వారే వున్నారని, అంబేద్కర్ను కాంగ్రెస్ పార్టీ నుండి రచన కమిటీ, డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్గా కాంగ్రెస్ పార్టీ చైర్మన్గా నియమించడం జరిగిం దన్నారు. ఆత్మగౌర వానికి గుర్తింపు భూమి, ఉద్యోగం, విద్య, రాజ్యధికారమని అందుకే రాజ్యాంగంలో భూమి లేని వారికి భూమి, ఉద్యోగాలు, విద్య కోసం రిజర్వేషన్లు ఇచ్చారని, అలాగే విద్య కోసం స్కాలర్ షిప్లు, వసతి గృహాలు ఇచ్చారని పేర్కొన్నారు. రాజ్యాధికారంలో రిజర్వేషన్లు ఇవ్వడం వల్లనే నేడు దళిత, గిరిజనులు పదవుల్లో ఉండగలుగుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాలలో దాదాపు 16 లక్షల ఎకరాల భూమి పేదలకు పంచి పెట్టిందని, కాని ఈ ప్రభుత్వం కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన భూములను లాకుని రైతు వేదికలు, వైకుంఠ దామలు కడుతున్నారని ద్వజమెత్తారు. చివరకు ఫార్మా సిటీ కోసం దళిత భూములు లాకున్నారని రూ.50 కోట్లకు ఎకరం ఉన్న భూమిని రూ.8లక్షలు ఇచ్చి లాగేసుకుంటున్నారని విమర్శించారు. కేసీఆర్ దళితబందు అని కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తామని చెప్పారని, భూమి లేకుండా, ఉద్యగం లేకుండా విద్య లేకుండా రూ.10లక్షలు ఇస్తే ఎలా న్యాయం జరుగుతుందో చెప్పాలన్నారు. కేసీఆర్ చెప్పిన భూమి ఏమైంది, డబల్ బెడ్ రూమ్ ఏమైందని నిలదీశారు. హుజురాబాద్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టే దళిత బంధు పథకం ముందుకు వచ్చిందని, దళిత బంధును కాంగ్రెస్ వ్యతిరేకించడం లేదని కాని ఈ పథకాని రాష్ట్రమంతా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
కౌశిక్రెడ్డి 10రోజుల కింద కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్లో చేరారని, ఈటెల రాజేందర్ పైన కౌశిక్రెడ్డి ద్వారా ఆరోపణలు చేయించి అవి కాంగ్రెస్ ద్వారా చేసినట్టు చేయించారని విమర్శించారు. ఉద్యమంలో పని చేసిన అనేక మందిని కాదని కౌశిక్ రెడ్డికి ఎందుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం ముమ్మాటీకీ ఉద్యమ వ్యతిరేకులకు పదవులు ఇస్తున్నారని చెప్పడానికి ఇదే నిదర్శనమన్నారు. సామాజిక, స్వయంపాలన, ఆత్మగౌరవ తెలంగాణ కావాలంటే ఉద్యమ కారులంతా కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.