. గత ప్రభుత్వ తప్పులన్నీ సరిదిద్దుతాం
. కళాకారులు, కవులు, ఉద్యమకారులను గుర్తిస్తాం
. గ్యారెంటీలను తప్పక అమలు చేస్తాం
. ప్రతిపక్షం జవాబుదారీగా ఉండాలి… సలహాలు, సూచనలు ఇవ్వాలి
. శాసనసభలో సీఎం రేవంత్రెడ్డి
విశాలాంధ్ర – హైదరాబాద్ : తెలంగాణలోని గత ప్రభుత్వ తప్పులను సరిదిద్దేందుకు బాధ్యత తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర పునర్నిర్మాణం, ఆర్థిక పరిస్థితుల మార్పునకు బాధ్యతగా నిర్ణయాలు తీసుకుటామని చెప్పారు. ప్రజా సంక్షేమానికి విపక్షాల నుంచి సలహాలు, సూచనలను స్వాగతిస్తామన్నారు. శుక్రవారం అసెంబ్లీలో సీఎం మాట్లాడుతూ మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు భారతరత్నను ప్రకటించడంపై హర్షం వ్యక్తంచేశారు. ప్రతిపక్షం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రభుత్వానికి సరైన సలహాలు, సూచనలు చేస్తూ పరిపాలనకు సహకరించాలని విపక్ష బీఆర్ఎస్నుద్దేశించి అన్నారు. కేఆర్ఎంబీ సమావేశాల్లో గత పాలకులు చేసిన సంతకాలతో నేడు కృష్ణా జలాలపై నిర్ణయం కేంద్రం చేతుల్లోకి వెళ్లిందన్నారు. 811టీఎంసీల నీటిలో 512.04టీఎంసీలను ఆంధ్రప్రదేశ్కు ఇచ్చేందుకు… 298.99టీఎంసీల నీటిని తెలంగాణ వాడుకునేందుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్రావు సంతకాలు చేసినట్లు బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్రావు అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి మంత్రి సమాధానం ఇచ్చారన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై అలసత్వం కారణంగా జలవనరులను రైతులు వినియోగించుకోలేని స్థితి ఏర్పడిరదని మండిపడ్డారు. రూ.లక్ష47వేల కోట్ల అంచనాలతో ప్రారంభించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇప్పటి వరకు రూ.97వేల కోట్లు ఖర్చు చేసినప్పటికీ కనీసం 90వేల ఎకరాలకు సాగునీరు అందించే పరిస్థితి లేదన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టు మేడిపండుగా మారిందని, అన్నారం పరిస్థితి ప్రశ్నార్థకంగా ఉందని విమర్శించారు. నల్గొండ జిల్లాలోని 3లక్షల60వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రారంభించిన ఎస్ఎల్బీసీలోని 40కిలోమీటర్ల టన్నెల్లో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే 30కిలోమీటర్ల టన్నెల్ పనులు పూర్తి చేస్తే తొమ్మిదిన్నరేళ్ల పాలనలో కనీసం కిలోమీటర్ టన్నెల్ను పూర్తి చేయలేదన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో నేడు రాష్ట్రంలో కృష్ణానది ప్రవహిస్తున్న కూడా రెండు టీఎంసీల నీటిని వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడిరదన్నారు. పాలమూరు రంగారెడ్డిని కూడా నిర్లక్ష్యం చేశారన్నారు. ఎంతసేపు ప్రాజెక్టులను అడ్డంపెట్టుకుని సాగునీటి పేరుతో సెంటిమెంట్తో రాజకీయం చేయడమే లక్ష్యంగా బీఆర్ఎస్ నాయకులు యత్నిస్తున్నారని అన్నారు. కృష్ణా జలాలపై చిత్తశుద్ధి ఉంటే ధర్నా చేయాల్సింది నల్గొండలో కాదు దిల్లీలో అని బీఆర్ఎస్ నేతలనుద్దేశించి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావుకు దమ్ముంటే కేంద్రానికి వ్యతిరేకంగా కృష్ణాజల్లాలపై దిల్లీలోని జంతర్మంతర్ వద్ద ఆమరణ దీక్ష చేయాలని, అందుకు కావాల్సిన బందోబస్తు ఏర్పాటు చేస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించిన కళాకారులు, ఉద్యమకారులకు గుర్తింపు ఇవ్వడంలో గత ప్రభుత్వం విఫలమైందన్నారు. కాళోజి, ప్రో.జయశంకర్, గద్దర్ వంటి వారికి ప్రాముఖ్యత ఇవ్వలేదంటే వారికి ఉద్యమకారులపై ఎంత చిత్తశుద్ధి ఉందో ఆర్థమవుతుందని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమకారులకు, కవులు, కళాకారులకు గుర్తింపు ఇచ్చేందుకు యత్నిస్తున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రొ.జయశంకర్ చివరి కోరిక మేరకు అయన స్వగ్రామాన్ని రెవెన్యూ గ్రామంగా గుర్తించినట్లు చెప్పారు. నంది పురస్కరాల స్థానంలో గద్దర్ పురస్కరాలు, అందేశ్రీ రాసిన జయజయహే తెలంగాణను రాష్ట్ర గీతంగా ప్రకటించామన్నారు. కొండాలక్ష్మణ్ బాపూజీ చివరి చూపుకు కేసీఆర్ వెళ్లలేదని, గద్దర్ మరణించిప్పుడు తమ ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు నిర్వహించిందని రేవంత్ రెడ్డి చెప్పారు. కొమరంభీం ఘాట్ను పూర్తి చేసేందుకు తమ ప్రభుత్వం రూ.10 కోట్లు కేటాయించడంతో పాటు వారి వారసులకు కూడా ఇళ్లు నిర్మించనున్నట్లు చెప్పారు. ఇంద్రవెల్లి స్మృతివనం ఏర్పాటు చేశామన్నారు. పాలనా అనుభవం ఉన్న వారు సభకు వచ్చి ప్రభుత్వ తప్పిదాలను చూపాలి… సలహాలు, సూచనలు ఇవ్వాలి కానీ కేసీఆర్ అసలు సభకే రారని వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్నప్పుడూ అంతే… ప్రతిపక్ష నేతగానూ ఆయన తీరులో మార్పు రాలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ చిహ్నంతో పాటు రాష్ట్ర గీతం, వివిధ భవనాల పేర్లను మార్చడంతో పాటు టీఎస్ స్థానంలో టీజీగా మార్చామని రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారని గత పాలకులను విమర్శించారు. ఉద్యోగులకు సమయానికి జీతాల ఇవ్వడంతో పాటు పింఛన్లు అందించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. త్వరలోనే మిగితా వాటిని సరిచేస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. ఎన్నికల సందర్భంగా తాము ప్రకటించిన ప్రతి హామీని అమలు చేస్తామన్నారు. గత పాలకుల మాదిరిగా ప్రశ్నపత్రాల లీకేజీలు, అవినీతికి తావివ్వకుండా పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగాల కల్పనకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం వల్ల ఆటో డ్రైవర్లను రెచ్చగొట్టి ప్రతిపక్షం లబ్ధిపొందాలనే కుట్రలు చేస్తుందని ఆరోపించారు. అసలు మహిళలకు ఉచిత ప్రయాణం అవకాశం ఇవ్వాలా వద్దా అనే దానిపై సూటిగా సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ను నిలదీశారు. అటో డ్రైవర్లను అడ్డం పెట్టుకుని ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదన్నారు. మాజీ సీఎంలా కాదు… నేను ప్రతి శాసనసభ్యునితో పాటు శాసనమండలి సభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు నుంచి సామాన్య ప్రజల వరకు అందరినీ కలుస్తానన్నారు. తనను కలిసి సమస్యలను వెల్లడిరచవచ్చన్నారు. ప్రతినిధులు ఇచ్చే ప్రతి సలహా, సూచనను తమ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని చెప్పారు. కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రనిధులు ఇటీవల తనను కలిస్తే సొంత పార్టీ నేతలు అనుమానించడంతో వారు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చిందని గుర్తుచేశారు. తమ ప్రభుత్వం అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తుందని రేవంత్ రెడ్డి హామీనిచ్చారు. అంతకుముందు బడ్జెట్ సమావేశాల ప్రారంభాన్ని పురస్కరించుకొని గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రవేశపెట్టారు. యెన్నం శ్రీనివాస్రెడ్డి ప్రతిపాదనను బలపర్చగా సభలో బీఆర్ఎస్ తరపున పల్లా రాజేశ్వర్రెడ్డి, సీపీఐ తరపున కూనంనేని సాంబశివరావు, ఎంఐఎం తరపున అక్బరుద్దిన్ ఒవైసీి, బీజేపీ తరపున పాయల్శంకర్ మాట్లాడారు.