తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఉల్లాసంగా.. ఉత్సాహంగా కొనసాగుతోంది. పాదయాత్రకు వస్తున్న వందలాది మందితో కలిసి రాహుల్.. తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ ఆదివాసీలతో కలిసి గుస్సాడీ నృత్యం చేశారు. రాహుల్ తమతో కలిసి నృత్యం చేయడంతో ఆదివాసీ మహిళలు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఈ సందర్భంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ములుగు ఎమ్మెల్యే సీతక్క, పలువురు కాంగ్రెస్ నేతలు కూడా రాహుల్ తో కలిసి స్టెప్పేలు వేశారు. కొమ్ము కోయ కళాకారులతో కలిసి రాహుల్ ఉత్సాహంగా నృత్యం చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆదివాసీల కళారూపం గురించి వివరించారు.కాగా.. భారత్ జోడో యాత్రలో కొమ్ముకోయ కళారూపం ఆకట్టుకుంటోంది. ఈ సమయంలో రాహుల్ వారిని చూసి.. కోయ కళాకారులతో కలిసి నృత్యం చేశారు. భారత్ జోడో యాత్ర కల్చరల్ కమిటీ చైర్మన్, సీఎల్పీ నేత, భట్టి విక్రమార్క.. ఖమ్మం జిల్లాకు చెందిన ఆదివాసీలతో కొమ్ము కోయ డ్యాన్స్ ఏర్పాటు చేశారు. దీనిని రాహుల్ మహబూబ్ నగర్ పాదయాత్రలో ఆసక్తిగా తిలకించినట్లు భట్టి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కొమ్ము కోయ ప్రదర్శనలో కళాకారులతో కలసి రాహుల్ లయబద్ధంగా అడుగులు వేస్తూ కార్యకర్తలను ఉత్సాహ పరిచారు.
విద్యారంగ సమస్యలపై మధ్యాహ్నం భేటీ..
రాహుల్ గాంధీ.. విద్యా సంబంధిత సమస్యలపై మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల మధ్య వివిధ సంస్థలు, ప్రముఖులతో భేటీ కానున్నారు. సమగ్ర విద్యా విధానం, ఫీజు రీయంబర్స్మెంట్, రెసిడెన్షియల్ పాఠశాలల్లో సమస్యలు, విద్యార్థులకు కలుషిత ఆహారం, సౌకర్యాల లేమి, యూనివర్సిటీలలో సమస్యలు తదితర అంశాలపై చర్చించనున్నారు.