రైతులకు న్యాయం చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని.. కాంగ్రెస్ జమానాలో ఇచ్చింది ఉచిత కరెంట్ కాదని, ఉత్త కరెంట్ అని మంత్రి హరీశ్రావు అన్నారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల కేంద్రంలో నూతన ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రతిపక్షాలపై విమర్శలు చేశారు. ఉచితాలు వద్దు అనే బీజేపీకి తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పాలంటూ పిలుపునిచ్చారు. పేదల సంక్షేమం కోసం పనిచేస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమని గర్వంగా చెప్పారు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్రావు మాట్లాడుతూ, కొత్తగా ఆసరా పింఛన్లు అందుకుంటున్న 584 మందికి శుభాకాంక్షలు తెలిపారు. ఇక నుంచి నెల నెల రూ. 2,016 అందుతాయని.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పింఛన్ రూ. 75 ఉండేదని చెప్పారు. అప్పట్లో ఎవరైనా చనిపోతేనే తప్ప వారి స్థానంలో నాడు కొత్తవి వచ్చేవి కావని.. ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 200 చేసిందని, ఒంటరి మహిళలకు, చేనేత, గౌడ పింఛన్లు ఇవ్వలేదని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మాత్రం ఏకంగా పదింతలు పెంచి రూ.2,016 చేశామని, పింఛన్ల డబ్బు పెంచి.. పింఛన్ల సంఖ్య కూడా పెంచామని హరీశ్రావు చెప్పారు.