బీజేపీ నేతలపై టీఆర్ఎస్ నేత మోత్కుపల్లి నర్సింహులు విరుచుకుపడ్డారు.దళితుల గురించి మాట్లాడే అర్హత బీజేపీ నేతలకు లేదని అన్నారు. దళితబంధు అమలైతే దతులంతా కేసీఆర్ వెంట ఉంటారని భయపడుతున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీ నేతలతో కలిసి తెలంగాణ భవన్లో మోత్కుపల్లి మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ను టచ్ చేస్తే మాడి మసై పోతారని వ్యాఖ్యానించారు. ఎవ్వరికీ పైసాకు అక్కరకు రాని పార్టీ బీజేపీ అని అన్నారు. బీజేపీ నేతలు దళిత బంధు కోసం డప్పులు కొట్టడం దురదృష్టకరమన్నారు. బండి సంజయ్ దళిత బంధు వద్దని డప్పు కొడుతున్నట్లుగా ఉందని అన్నారు. దేశంలోని 28 రాష్ట్రాల్లో ఎక్కడైనా దళితబంధు లాంటి పథకం ఉందా అని ప్రశ్నించారు. 70 ఏండ్లలో దళితులకు ఏనాడూ న్యాయం జరగలేదన్నారు. అంబేద్కర్ ఆలోచనలు అమలుచేస్తున్న నాయకుడు సీఎం కేసీఆర్ అని అన్నారు.ఓట్ల కోసం బీజేపీ గారడి వేషాలు మానుకోవాలని హితవుపలికారు. దళిత బంధు రాకుండా కుట్రలు చేస్తున్నారని..దీన్ని ఖండిస్తున్నానన్నారు.ఎన్నికల ముందు ప్రధాని మోదీ ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు జమచేస్తామన్నారని, ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. కుల వ్యవస్థ నిర్మూలించాలని సీఎం కేసీఆర్ నడుం కట్టారని చెప్పారు. కేంద్రం అన్ని రంగాలను ప్రైవేట్పరం చేస్తున్నదని, బడుగుబలహీన వర్గాలను బీజేపీ ప్రభుత్వం మోసం చేస్తున్నదని ఆరోపించారు. పెట్రోల్, డీజిల్ ధరలను రోజూ పెంచితే ప్రజలు ఎట్ల బతుకుతారని ప్రశ్నించారు. వరి ధాన్యం కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.బీజేపీ, కాంగ్రెస్ అపవిత్ర కలయిక వల్ల ఈటల గెలిచారని విమర్శించారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో మూడు వేల ఓట్లే వచ్చినా రేవంత్ రెడ్డి సిగ్గులేకుండా పీసీసీ చీఫ్గా కొనసాగుతున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ ఓట్లను గుండుగుత్తగా ఈటలకు అమ్ముకున్నాడని ఆరోపించారు.