డా. శ్యామ సుందర్
కార్మిక చట్టాల రూపకల్పన కేంద్రం, రాష్ట్రాలకు సంబంధించిన అంశం. ఉమ్మడి జాబితాలో ఉన్న ఈ అంశాన్ని మోదీ ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకొని 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్సుగా తయారు చేసింది. ఇవి కార్మికుల ప్రయోజనాలను, హక్కులను హరించి వేస్తాయని దేశ వ్యాప్తంగా నిరసన వ్యక్తమైంది. వేతనాల కోడ్ (సిడబ్ల్యు), పారిశ్రామిక సంబంధాల కోడ్ (ఐఆర్సి, వృత్తి భద్రత, ఆరోగ్యం పని పరిస్థితుల కోడ్ (ఒఎస్హెచ్డబ్ల్యుసిసి), సామాజిక భద్రత కోడ్ (సిఎస్ఎస్) వీటిని రూపొందించి రెండేళ్లు గడిచినప్పటికీ ఇంతవరకు అమలు చేయలేదు. ఇందుకు బలమైన కారణమే ఉందని భావించవచ్చు. ఇవి హానికరమైనవని కార్మికులు విశ్వసిస్తూ, అమలును ప్రతిఘటించాలని నిర్ణయించారు. అలాగే 19 రాష్ల్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కార్మిక కోడ్స్ అమలుకు సంబంధించిన నియమనిబంధనల ముసాయిదాను తయారు చేయలేదు. కర్నాటక, గుజరాత్, త్రిపురలు మాత్రం సిఎస్ఎస్, ఒఎస్హెచ్డబ్ల్యుసిసి కోడ్స్ అమలు ముసాయిదాను రూపొందించలేదు. రాజస్థాన్ డబ్ల్యుసి ముసాయిదాను రూపొందించింది. రైతులు మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ 9 నెలలుగా మహత్తర పోరాటం చేయడం, రైతులతో కలిసి కార్మిక వర్గం ఉద్యమానికి సిద్ధం కావడం, కొవిడ్
19 మహమ్మారి సమయంలో పరిశ్రమలు, వ్యాపార వాణిజ్య సంస్థల మూత తదితర కారణాలు అమలుకు అడ్డుగా నిలిచి ఉండవచ్చు. తుది నియమ నిబంధనలు జారీ చేయడానికి ముందు 30 రోజుల గడువు ఇచ్చి ప్రజాభిప్రాయాలు సేకరించవలసి ఉంటుంది.
కేంద్రం నియమ నిబంధనలు ముసాయిదా రూపంలో ఉన్నాయి. యాజమాన్యాల సంఘాలు, కేంద్ర ట్రేడ్ యూనియన్లు కోడ్స్లో అనేక క్లాజులను వ్యతిరేకిస్తున్నాయి. ఉదాహరణకు వేతనాలలో 50 శాతం అలవెన్సులను యజమానులు వ్యతిరేకిస్తున్నారు. అలాగే కార్మిక యూనియన్లు చాలా క్లాజులను వ్యతిరేకిస్తున్నాయి. వీటిలో సంప్రదింపుల ఏజెన్సీలు (ఎన్యు/ఎన్సి) యదార్థమని నిరూపించటం, చర్చల అంశాలు, యూనియన్ల గుర్తింపు కాలం, గుర్తింపు పొందిన యూనియన్లకు సౌకర్యాల క్లాజులున్నాయి. కేంద్రం ఎన్యు/ఎన్సి నియమ నిబంధనలను 2021 మే 5న ప్రకటించగా, పంజాబ్ ప్రభుత్వం అంతకు ముందే 2021 మార్చి 5న నియమ నిబంధనలను వెల్లడిరచింది. ఎన్/ఎన్సి గుర్తింపు క్లాజులను పూర్తిగా పంజాబ్ మినహాయించింది. మహారాష్ట్ర 1971లో చేసిన ట్రేడ్ యూనియన్ల, అవాంఛనీయ కార్మిక కార్యకలాపాల నిరోధక చట్టంలో సభ్యత్వ పరిశీలనకు అనుకూలతను చేర్చింది. ఒక పరిశ్రమలో 25 శాతం కంటే ఎక్కువ సభ్యులున్న రిజస్టరైన యానియన్ ఉన్నట్లయితే దాన్ని యజమాని గుర్తించాలని బిహార్ ప్రభుత్వం కోరుతోంది. కేరళ, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రహస్య బ్యాలెట్ను కోరాయి. గుజరాత్ మాత్రం ఒక్క యూనియన్ను మాత్రమే చర్చలకు అనుమతించాలని కోరుతోంది. ఒకటి కంటే ఎక్కువ యూనియన్లు ఉంటే, రిజిస్టరు అయిన తర్వాత ఆరు నెలలు గడిచాకనే చర్చలకు అనుమతిస్తారు. ఇలా రాష్ట్రాలన్నీ భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నాయి. కార్మికులకు హాని కలిగించే క్లాజులను తొలగించాలని ట్రేడ్ యూనియన్లు కోరుతుండగా, యజమానులకు అనుకూలంగా చట్టాలను రూపొందించే పనిలో మోదీ ప్రభుత్వం ఉంది. కార్మిక వర్గం ప్రతినిధులు, ఇందుకు సంబంధించిన నిపుణులతో కూడా సంప్రదించకుండా కోడ్స్ను రూపొందించడంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) కూడా తన వ్యతిరేకతను వ్యక్తం చేసింది.