ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించాలి
జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి
విశాలాంధ్ర – విజయనగరం : ఉత్తరాంధ్ర పట్టభద్రుల శాసనమండలి స్థానం కోసం మార్చి 13న ఎన్నిక జరుగుతుందని, దీనికోసం జిల్లాలో అదనంగా 8 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి తెలిపారు. జిల్లాలో ఈ ఎన్నికను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, దీనికి రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. ఎంఎల్సి ఎన్నికలకు సంబంధించి, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ తన ఛాంబర్లో శుక్రవారం సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ సూర్యకుమారి మాట్లాడుతూ, జిల్లాలో గ్రాడ్యుయేట్ ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పారు. కొన్ని పోలింగ్ స్టేషన్ల పరిధిలో ఓటర్ల సంఖ్య 1400 కంటే ఎక్కువగా ఉండటం వల్ల, అదనంగా 8 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. గత ఎన్నికల్లో 64 కేంద్రాలు ఉండగా, ఈ ఎన్నికలకు పోలింగ్ కేంద్రాల సంఖ్య 72కు చేరిందని తెలిపారు. రాజాంలో 1, బొబ్బిలిలో 2, విజయనగరంలో 2, శృంగవరపుకోటలో 2, లక్కవరపుకోటలో 1 చొప్పున పోలింగ్ కేంద్రాలు పెరుగుతున్నాయని చెప్పారు. బొబ్బిలి, విజయనగరం, శృంగవరపుకోటల్లో ఒక్కో పోలింగ్ కేంద్రంలో చిన్నపాటి మార్పులు చోటుచేసుకున్నాయని తెలిపారు.
ఈ ఎంఎల్సి స్థానం ఎన్నికకు సంబంధించి నామినేషన్లు, స్క్రూటినీ, ఉపసంహరణ, లెక్కింపు తదితర ప్రక్రియలన్నీ విశాఖపట్నంలోనే జరుగుతాయని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలో ఎన్నికల కోడ్ను పకడ్భందీగా అమలు చేస్తామని చెప్పారు. ఓటర్ల జాబితాల్లో తప్పులు దొర్లకుండా, డూప్లికేషన్ లేకుండా ఖచ్చితమైన జాబితాను తయారు చేస్తామని చెప్పారు. జిల్లాలో ఎన్నిక ప్రక్రియను సజావుగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాజకీయ పార్టీలన్నీ దీనికి సహకరించాలని కోరారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సందేహాలను కలెక్టర్ నివృత్తి చేశారు.
జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూల్ను వివరించారు. ఈ సమావేశంలో వైకాపా, టిడిపి, సిపిఐ, సిపిఎం పార్టీల ప్రతినిధులు, కలెక్టరేట్ ఎన్నికల విభాగం అధికారులు, వివిధ మండలాల తాశీల్దార్లు పాల్గొన్నారు.