విశాలాంధ్ర – విజయనగరం అర్బన్: విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిగా శుక్రవారం మాజీ ఎమ్మెల్యే మీసాల గీత నామినేషన్ వేయనున్నారు. ఆత్మగౌరవం నినాదంతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నానన్నారు. 2019లో సిటింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తనకు తెదేపా కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా టికెట్ వేరొకరికి కేటాయించిందన్నారు. అయినప్పటికీ పార్టీ నిర్ణయానికి కట్టుబడి అంకిత భావంతో పనిచేశానన్నారు. ఈ ఎన్నికలలో కచ్చితంగా ఇస్తామని చెప్పి చివరికి ఇవ్వకుండా అవమానించారన్నారు. మీ ఆడబిడ్డగా ఎన్నికల బరిలో దిగానని, ఆశీర్వదించి అఖండ మెజారిటీతో గెలిపించాలని విజయనగర నియోజకవర్గం ప్రజలను కోరారు.