పర్యావరణానికి తూట్లు…
దొడ్డిదారిన కలప తరలింపు…
పట్టని యంత్రాంగం…
ముదినేపల్లి : పర్యావరణ పరిరక్షణకు చెట్లు మొక్కలు నాటడం ప్రభుత్వం లక్ష్యంకాగా దశాబ్దాల నాటి చల్లని నీడనిచ్చే చెట్లు కనుమరుగవుతున్నాయి.గాలివానలకు పలుచోట్ల ఇతర చెట్లపై పడిన చెట్లు ఎప్పటికైనా కూలే ప్రమాదం ఉందని ఒరిగిన చెట్లను తొలగించే క్రమంలో సమీపంలో ఉన్న చెట్లను , కొన్నిచోట్ల పెద్ద వృక్షాల కొమ్మలను నరకటం పరిపాటిగా మారింది. ముదినేపల్లి మండలం గుడివాడ-బంటుమిల్లి రోడ్డు ప్రక్కన సినిమాహాలు నుండి ఇటీవల పెద్ద చెట్లు నరికి కలపను తరలించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఒకప్పుడు ఈ రహదారిపై ఎండ ఆనవాలు కనపడకుండా దట్టంగా చెట్లు ఇరువైపులా అల్లుకుని ఉండేవి.బాటసారులు సేదతీరుతూ 2,3 కిలోమీటర్లు నడిచి వెళ్లేవారు.ఇటీవల కాలంలో దశాబ్దాల నాటి నీడనిచ్చే చెట్లపై దళారుల కన్నుపడింది. గాలివాన రావడం వారికి వరంగా మారింది.ఏ చిన్న చెట్టు పడినా, ఒరిగినా వెంటనే వారు రంగప్రవేశం చేసి చక్రం తిప్పుతారు.ఏదో విధంగా కలపను తరలించుకుపోవడం అంతుచిక్కని ప్రశ్నగా మారింది. అధికారుల ప్రమేయం ఎంత వరకు ఉంది. దళారుల వ్యవహారంపై పలు అనుమానాలు స్థానికుల్లో వ్యక్తం అవుతున్నాయి.జిల్లా ఉన్నతాధికారులు స్పందించి పర్యావరణాన్ని కాపాడేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.