విశాలాంధ్ర ఏలూరు: అటవీ అమరవీరుల త్యాగాలు అజరామరం అని జిల్లా అటవీ శాఖ అధికారి రవీంద్ర దామా అన్నారు. ఆంధ్రప్రదేశ్ అటవీ అమరవీరుల దినోత్సవం స్థానిక అశోక్ నగర్ లోని జిల్లా అటవీ శాఖాధికారి కార్యాలయంలో గురువారం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి జిల్లా అటవీ శాఖాధికారి రవీంద్ర దామా అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రవీంద్ర దామా మాట్లాడుతూ అటవీ సంరక్షణలో ప్రాణాలు కోల్పోయిన అటవీ అమరవీరుల జ్ఞాపకార్థం ప్రతీ ఏటా నవంబర్, 10వ తేదీన అటవీ అమరవీరుల దినోత్సవం నిర్వహిస్తున్నామన్నారు. ఏలూరు అటవీ డివిజన్ పరిధిలో అటవీ సంరక్షణకై 23 మంది తమ ప్రాణాలను అర్పించారని, ఈ సందర్భంగా వారి సేవలను కొనియాడుతూ వారికి నివాళులు అర్పించారు. వారి ఆత్మ శాంతికై సమావేశం 2 నిముషాలపాటు మౌనం పాటించింది. అనంతరం జిల్లా అటవీ శాఖాధికారి కార్యాలయం నుండి ఫైర్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎస్.వి.కె. కుమార్, టెరిటోరియల్, వన్యప్రాణి యాజమాన్య విభాగం సిబ్బంది, ప్రభృతులు పాల్గొన్నారు.