పాఠశాలలకు సెలవులు ఇచ్చే ఉద్దేశం లేదు : మంత్రి సురేష్
భవిష్యత్ కోసం ఆన్లైన్ విద్యా విధానం తప్పనిసరని మంత్రి ఆదిమూలపు సురేష్ వ్యాఖ్యానించారు. . గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఉన్నత విద్యలో కొత్త కోర్సులు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు. కేవలం తరగతి గదిలోనే నేర్చుకునే రోజులు పోయాయి, భవిష్యత్లో ఆన్లైన్ కోర్సులకు మరింత డిమాండ్ ఉంటుందన్నారు. గుంటూరు వడ్లమూడిలో విజ్ఞాన్ యూనివర్సిటీలో ఉన్నత విద్యామండలి చైర్మన్తో కలిసి మంత్రి ఇవాళ ఆన్లైన్ విద్యాభ్యాసం ప్రారంభించారు. ఈ సందర్భంగా పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యోగుల నిరసనలు,కొవిడ్ నేపథ్యంలో పాఠశాలల నిర్వహణపై మంత్రి స్పందించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డితో జరిగిన సమావేశంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఈ పీఆర్సీకి అప్పుడు అంగీకరించి.. ఇప్పుడు ఆందోళనలు చేయడం సరికాదని అన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు ఈ పీఆర్సీకి అంగీకరించి మళ్లీ ఇప్పుడు ఎందుకు ఆందోళనలు చేస్తున్నారని ప్రశ్నించారు. వారికి ఏమైనా ఇబ్బందులు ఉంటే ప్రభుత్వంతో మాట్లాడాలన్నారు.
ఏపీలో కోవిడ్ కేసులు పెరుగుతున్నా… దాని తీవ్రత రాష్ట్రంలో అంతగా లేదన్నారు. పాఠశాలలకు సెలవులు ఇచ్చే ఆలోచన లేదని తెలిపారు. ఎక్కడైనా పిల్లలకు కోవిడ్ వస్తే ఆ పాఠశాల వరకూ మూసివేసి, శానిటైజ్ చేసిన తర్వాత మళ్లీ ప్రారంభిస్తామని చెప్పారు. కొన్ని యూనివర్సిటీలు పరీక్షలు కూడా నిర్వహిస్తున్నాయన్నారు. కోర్టు కూడా పరీక్షలకు అనుమతి ఇచ్చిందని మంత్రి సురేష్ పేర్కొన్నారు.