హైదరాబాద్ : ప్రముఖ కూచిపూడి డ్యాన్సర్ సంధ్యారాజు నటిస్తూ స్వయంగా నిర్మించిన చిత్రం ‘నాట్యం’. రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో నిశ్రింకళ ఫిల్మ్ పతాకంపై రూపొందిన ఈ చిత్రం ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ‘నాట్యం’ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన మాట్లాడుతూ.. ‘నాట్యం సినిమా చాలా చక్కగా అనిపించింది. మంచి ఫీలింగ్ను కలిగించింది. నాట్యం అంటే ఓ కథను అందంగా, దృశ్యరూపంలో చూపించడం. నాట్యం అంటే కాళ్లు, చేతులు లయబద్దంగా ఆడిరచడం అనుకుంటారు. కానీ దర్శకుడు రేవంత్, సంధ్యా రాజు మాత్రం కథను అందంగా చెప్పడం అని చూపించారు. ఇలాంటి చిత్రాలు అనగానే మనకు కె. విశ్వనాథ్ గారే గుర్తొస్తారు. ఆయనని స్ఫూర్తిగా తీసుకునే ఈ సినిమాను తీసినట్టు నాకు అనిపిస్తోంది. మన కళలు, నాట్యం, సంగీతం ఇలా అన్నింటిపైనా ఆయనకున్న గ్రిప్, ప్యాషన్ గానీ అంతా ఇంతా కాదు. యంగ్ డైరెక్టర్ అయిన రేవంత్ మళ్లీ ఇలాంటి ప్రయత్నం చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఇలాంటి వారు రావాలి. మన ఆచారాలు, సంప్రదాయాలు, కళలను మరిచిపోతోన్న ఈ తరంలో ఇలాంటి సినిమా రావడం సంతోషంగా ఉంది. ఈ ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. దానికి ఆలంబనగా, ఎంతో ప్యాషన్ ఉన్న సంధ్యా రాజు ముందుకు రావడాన్ని మనం అభినందించాలి. పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చారు.. డబ్బు కోసమని కాకుండా తనకున్న ప్యాషన్, కళల పట్ల తనకున్న అంకిత భావాన్ని తెలియజేస్తుంది. ఈ సినిమా ద్వారా నాట్యం గొప్పదనం కోట్ల మందికి చేరుతుంది’ అని అన్నారు.