అహ్మదాబాద్: ఐపీఎల్ టోర్నమెంట్.. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుపై కనక వర్షాన్ని కురిపిస్తోంది. వరల్డ్ బిగ్గెస్ట్ స్పోర్ట్స్ ఈవెంట్లల్లో ఒకటిగా ఇదివరకే గుర్తింపు తెచ్చుకున్న ఈ ధనాధన్ ఫార్మట్ బీసీసీఐకి బంగారుబాతులా మారింది. కొత్తగా మరో రెండు ఫ్రాంఛైజీలు వచ్చి చేరిన తరువాత మరింత డిమాండ్ పెరిగింది. ఈ రెండు ఫ్రాంఛైజీల ద్వారా 13 వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని చవి చూసింది. అహ్మదాబాద్ నుంచి సీవీసి కేపిటల్స్, లక్నో నుంచి ఆర్పీ-సంజీవ్ గోయెంకా జట్లు రావడంతో ఐపీఎల్ మ్యాచ్ల సంఖ్య మరింత పెరగనుంది.
రేసులో ముడు కంపెనీలు..
దానికి అనుగుణంగా ప్రసార హక్కుల ద్వారా రాబట్టుకోవాల్సిన ఆదాయాన్ని మరింత పెంచుకోనుంది బీసీసీఐ. 2023-2027 మధ్య ఐదేళ్ల కాలానికి సంబంధించిన ప్రసార హక్కులను మంజూరు చేయడం ద్వారా కనీసం ఐదు బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సాధించాలని బీసీసీఐ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. 2018-2022 మధ్య కాలానికి సంబంధించిన ప్రసార హక్కుల కాల పరిమితి వచ్చే ఏడాది ముగిసిపోనుంది.
ఐదేళ్ల కాలానికి సంబంధించిన బిడ్డింగులు..
దీనితో మరో ఐదేళ్ల కోసం బీసీసీఐ బిడ్డింగులను ఆహ్వానించింది. స్టార్ నెట్వర్క్, సోనీ-జీ నెట్వర్క్తో పాటు త్వరలో రానున్న జియో ఛానల్ కూడా ఈ బిడ్డింగ్ ప్రక్రియలో భాగస్వామ్యమైంది. తన బిడ్డింగులను దాఖలు చేసింది. ప్రస్తుతానికి 16,347.50 కోట్ల రూపాయల మేర విలువ చేసే బిడ్డింగులను అందుకుంది. ఈ విలువ మరింత రెట్టింపు అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. క్రమంగా ఇది ఐదు బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని అంటున్నారు.
రూ.36 వేల కోట్లకు పైగా..
మన దేశీయ కరెన్సీతో పోల్చుకుంటే దీని విలువ 36 వేల కోట్ల రూపాయలు పైమాటే. 2022 నుంచి ఐపీఎల్ టోర్నమెంట్లల్లో మొత్తం 10 జట్లు పాల్గొనబోతున్నాయి. మ్యాచ్ల సంఖ్య కూడా పెరుగుతుంది. 74కు చేరకుంటుంది. లక్షలాది మందిని టీవీకు అతుక్కునిపోయేలా చేసే ఈ టోర్నమెంట్ ద్వారా 36 వేల కోట్ల రూపాయల ఆదాయం అందుతుందనే అభిప్రాయాలు ఉన్నాయి. ప్రసారాల హక్కులను కేటాయించడం వల్ల అదనంగా అందే మొత్తం ఇది.
బిడ్డింగుల్లో జాప్యం..
బీసీసీఐ అక్టోబర్ 25న దుబాయ్లో టెండర్ ఆహ్వానాన్ని విడుదల చేయాల్సి ఉంది. ఇందులో జాప్యం ఏర్పడిరది. అహ్మదాబాద్కు చెందిన సీవీసీ కేపిటల్స్ గొడవ తేలాల్సి ఉంది. బెట్టింగ్స్తో ముడిపడి ఉన్న సీవీసీ కేపిటల్స్కు ఫ్రాంఛైజీ బిడ్డింగ్ను దక్కించుకోవడం పట్ల పోటీదారులు ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. సీవీసీ అత్యధికంగా బిడ్డింగులను దాఖలు చేయడంతో అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీలు.. ఫ్రాంఛైజీ రేసు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దీనితో అదాని సీవీసీ కేపిటల్స్పై బెట్టింగుల ముద్ర వేసింది.
ముగ్గురు పోటీదారులు..
టీవీ, డిజిటల్ మీడియా హక్కుల మార్కెట్లో ముగ్గురు ప్రధాన పోటీ దారులు కొనసాగుతున్నారు. 2008-2017 వరకు హక్కులను కలిగి ఉన్న సోనీని స్టార్ ఇండియా అధిగమించింది. సోనీ అప్పట్లో 11,050 కోట్ల రూపాయల విలువ చేసే టెండర్లన దాఖలు చేసింది. సోనీ-జీతో పోల్చి చూస్తే- స్టార్ ఇండియా దాదాపు రూ .5,300 కోట్లు ఎక్కువ బిడ్ చేసినట్లు చెబుతున్నారు. ఈ రెండు కంపెనీలతో పాటు జియో ఛానల్ కూడా పోటీలో నిలవడం ఆసక్తి రేపుతోంది.
జియో ఛానల్ కూడా..
త్వరలో జియో ఛానల్ అందుబాటులోకి రానుంది. 2023 నాటి ఐపీఎల్ సీజన్ మొదలయ్యే నాటికి జియో ఛానల్ మనుగడలోకి వస్తుంది. అందుకే జియో ఛానల్ ద్వారా ఐపీఎల్ మ్యాచ్లను టెలికాస్ట్ చేయడానికి అవసరమైన ప్రతిపాదనలను దాఖలు చేసింది. దీనిపై బీసీసీఐ ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. జియో ఛానల్ పోటీలో ఉండటం వల్ల మిగిలిన రెండు కంపెనీలు గట్టిపోటీని ఎదుర్కొంటున్నాయి. ఐదేళ్ల కాలానికి సంబంధించిన బిడ్డింగ్స్ కావడం వల్ల జియో ఛానల్ తనవంతు ప్రయత్నాలు చేస్తోంది. పావులు కదుపుతోంది.